న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లిన బంగారం క్రమంగా దిగి వస్తున్నది. మహిళలు ఎంతో ఇష్ట పడే బంగారం ధర.. అంతర్జాతీయంగానూ నెలకొన్న బలహీనతల మధ్య ఎంసీఎక్స్ మార్కెట్లో పది నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఏప్రిల్ ఫ్యూచర్స్లో గురువారం పది గ్రాముల బంగారం ధర రూ.44,712లకు పతనమైంది. గతేడాది ఆగస్టులో ఆల్టైం రికార్డు నమోదు చేసిన తులం బంగారం ధర రూ.56,200 కంటే భారీగా దిగువకు జారిపోయింది.
అయితే, బంగారానికి భిన్నంగా వెండి కాస్త పుంజుకున్నది. ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి మార్చి ఫ్యూచర్స్ ధర స్వల్పంగా 0.40 శాతం తగ్గి కిలో ధర రూ.66,450 పలకింది. అయితే, బులియన్ మార్కెట్ విశ్లేషకులు మాత్రం బంగారం ధర తిరిగి పుంజుకోవడానికి కొన్ని రోజుల ముందు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ప్రస్తుతం తులం బంగారం ధర 45,600 పలుకుతున్నది.
అమెరికా ట్రెజరీ బాండ్ల కొనుగోళ్లు పెరుగడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1704.55 డాలర్లు పలికింది. ఇది గతవారంతో పోలిస్తే 1.47 శాతం పతనం. ఇన్వెస్టర్లు బంగారం పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపలేదు. అయితే అమెరికా డాలర్ బలోపేతం కావడంతో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు క్రమంగా దూసుకెళ్తున్నాయి. ఫలితంగా పెట్టుబడికి ప్రత్యామ్నాయ మార్గంగా ఉన్న బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది.
టెక్నికల్గా బంగారం ఔన్స్ధర 1760 డాలర్ల దిగువనే మరో వారం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ట్రెజరీ బాండ్లు, డాలర్ బలోపేతమైనా కొద్దీ బంగారం కొనుగోళ్లు, పసిడిపై పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాను నియంత్రించడానికి వ్యాక్సినేషన్ జరుగుతుండటంతోపాటు అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం పొందుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే బంగారం ధర మరింత తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.ప్రస్తుతానికి బంగారం ధరలో సర్దుబాట్ల వల్ల మధ్య కాలిక కోణంలో దానిపై పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచించవచ్చునని అటున్నారు.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవ్నీత్ దమానీ స్పందిస్తూ ‘ప్రస్తుతం మధ్యకాలికంగా కామెక్స్లో ఔన్స్ బంగారం ధర 1700 వద్ద ఉంటుంది. దేశీయ మార్కెట్లో రూ.45,500-45000 పలుకుతుండగా రూ. 49,000-49,800 లక్ష్యాన్ని నిర్దేశించుకోవచ్చు’ అని అన్నారు.