న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, ఆయన భార్య పూనం జైన్ సహా మంత్రి సహచరుల ఇండ్లపై జరిపిన ఈడీ దాడుల్లో పెద్దమొత్తంలో నగదు, బంగారం లభ్యమైంది. ఈడీ అధికారులు ఇప్పటివరకూ 1.8 కిలోల బంగారం, రూ 2.82 కోట్ల నగదును సీజ్ చేశారు.
అవినీతి కేసులో మే 30న ఈడీ మంత్రి సత్యేందర్ జైన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జైన్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. సత్యేందర్ జైన్ తన భార్య, కుమార్తెలు, స్నేహితులు, అనుచరుల సహకారంతో హవాలా లావాదేవీల ద్వారా రూ 16 కోట్లు దారిమళ్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈడీ జప్తు నుంచి తప్పించుకునేందుకు సత్యేందర్ జైన్ కంపెనీకి చెందిన భూమిని నిందితుల్లో ఒకరు ఆయన అనుచరుల పేరిట బదిలీ చేశాడని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక జైన్ నివాసం నుంచి పలు డాక్యుమెంట్లు, డిజిటల్ రికార్డులను ఈడీ స్వాధీనం చేసుకుంది. జైన్ నివాసాల నుంచి పెద్దమొత్తంలో లెక్కతేలని నగదు, బంగారాన్ని పీఎంఎల్ఏ కింద సీజ్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు.