అలంపూర్, అక్టోబర్ 4 : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జోగుళాంబ అమ్మవారు సిద్ధిదాత్రిగా భక్తులకు దర్శనమిచ్చారు. అలంపూర్ పుణ్యక్షేత్రం శోభాయమానంగా వెలుగొందుతున్నది. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో విశేష పూజలు కొనసాగుతున్నాయి. యాగశాలలో ఆవాహిత దేవతలకు శోడషోపచార ప్రాతఃకాల పూజలు, ఆవాహిత దేవతా హోమాలు, నిత్య బలిహరణలు, చండీహోమాలు నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మ వారికి మహా నివేదన సమర్పించారు. అర్చకులు భక్తుల కోరిక మేరకు కుంకుమార్చనలు చేశారు. సిద్ధిదాత్రి అలంకరణలో ఉన్న అమ్మవారిని ఉపాసించడం వల్ల సర్వ సిద్ధులు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈ దేవీ కృపవల్లే పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి.
సిద్ధిదాయినిగా శ్రీశైల భ్రామరి
శ్రీశైలం, అక్టోబర్ 4 : శ్రీశైల క్షేత్రంలో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు మహర్నవమి సందర్భంగా భ్రామరీ అమ్మవారిని సిద్ధిదాయిని రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అశ్వవాహనంపై ప్రత్యేక పూజలందుకొని భక్తులకు దర్శనమిచ్చా రు. సాయంత్రం అక్క మహాదేవి అలంకారమండపంలో అశ్వవాహనంపై ఆశీనులైన భ్రమరాంబమల్లికార్జున స్వామి, అమ్మవార్లకు రుత్వికులచే శా స్ర్తోక్త పూజలు జరిపించినట్లు ఈవో లవన్న తెలిపారు. సిద్ధిదాయిని అలంకరణలో చతుర్భుజాలను కలిగి కుడివైపు చక్రం, గద, ఎడమవైపు శంఖం, పద్మాలను ధరించి భక్తులకు అభయమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన యాత్రికులతో క్షేత్రం సందడిగా మారింది. ఆలయ ప్రాకారోత్సవంతోపాటు గ్రామోత్సవంలో చెంచు కళాకారులు, జానపదాలు, కో లాటాలు, చెక్కభజన, బీరప్పడోలు, నందికోలు, బుట్టబొమ్మలు, ఢమరుకనాదాలు, సప్తస్వర విన్యాసాలు, కర్ణాటక డప్పు కళాకారుల వీరంగ నృ త్యాలతో ఉత్సవం సందడిగా కొనసాగింది. కాళరాత్రిపూజ మంత్రపుష్పంతోపాటు అమ్మవారికి ఆస్థానసేవ, ఏకాంతసేవలు జరిగాయి.