కొత్తగూడెం: గోదారమ్మ శాంతించింది. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో వరద స్వల్పంగా తగ్గింది. శనివారం రాత్రి 11 గంటలకు 48.50 అడుగులుగా వున్న గోదావరి నీటి మట్టం.. ఆదివారం ఉదయం 7 గంటలకు అడుగున్నర తగ్గి 47.2 అడుగులకు చేరింది. దీంతో అదికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నదిలో 11,34,957 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది.
భారీ వరదలతో స్లూయీజ్లు లీక్ కావడంతో అన్నదాన సత్రం వద్దకు నీరు చేరింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు మోటర్ల సహాయంతో తోడేస్తున్నారు. రోడ్లమీదికి నీళ్లు రావడంతో పర్ణశాలకు రాక పోకలు నిలిచిపోయాయి. సీత వాగు వద్ద సీతమ్మ విగ్రహం మునిగిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.