ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి (Godavari) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. బుధవారం ఉదయం 5 గంటలకు 54.3 అడుగులకు చేరుకుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 14,92,679 క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది.
కాగా, గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లోని పలుమండలాలు అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం నుంచి చర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు పెద్దఎత్తున ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతాలకు వెళ్లేప్రధాన రహదారిపై నెల్లిపాక వద్ద వరద నీరుచేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.