భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు 31.5 అడుగులు ఉన్న నీటిమట్టం క్రమంగా పెరుగుతూ సాయంత్రం 6 గంటల సమయానికి 36.1 అడుగులకు చేరింది.
సోమవారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక చేరుకోవచ్చని కేంద్ర జల వనరుల సంఘం అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూలై నెలలో ఒకసారి, ఆగస్టు నెలలో ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి. తాజాగా మరోమారు భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తడంతో లోతట్టు కాలనీ వాసులు, ముంపు వాసులు ఆందోళన చెందుతున్నారు.