ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమేణా తగ్గుముఖం పడుతున్నది. బుధవారం రాత్రి 11 గంటలకు 54.20 అడుగుల వద్ద నీటిమట్టం ఉండగా మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగింది. గురువారం ఉదయం 6 గంటలకు 53.50 అడుగులకు చేరుకుని అప్పటి నుంచి ప్రతి గంటకూ ఒక ఇంచు వరద తగ్గుతూ వస్తున్నది. గురువారం రాత్రి 8 గంటలకు 51.70 అడుగులకు చేరుకున్నది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. కలెక్టర్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు.