హైదరాబాద్: ఉగ్రగోదావరి శాంతించింది. ఎగువన వర్షాలు లేకపోవడంతో క్రమంగా వరద తగ్గుముఖం పడుతున్నది. భద్రాచలం వద్ద వదర ఉధృతి తగ్గుతూ వస్తున్నది. గోదవారి నీటిమట్టం ప్రస్తుతం 64 అడుగులకు చేరుకున్నది. ఇప్పుడు 20.01 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో భద్రాచలం వద్ద వరద 75 అడుగులకు చేరుతుందని అధికారులు భావించారు. అయితే వానలు తగ్గిపోవడంతో వరద కూడా ఆదిపోయింది. దీంతో వదరగోదావరి కాస్త శాంతించింది.
కాగా, భారీ వరదలతో భద్రాచలంలోని పలు కాలనీలు ఇప్పటికే ముంపులోనే ఉన్నాయి. సుభాష్నగర్, కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ వరద నీటిలో మునిగిపోయాయి. కరకట్ట బ్యాక్ వాటర్ రామాలయం ప్రాంతంలోకి వస్తున్నది. దీంతో రామాలయం వద్ద వరద పెరుగుతుండటంతో ఆలయ పడమర మెట్లు, అన్నదాన సత్రం నీటమునిగిపోయాయి. వరద విలయంలో చిక్కుకున్న భద్రాచలంలో వరద, సహయక చర్యలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్వవేక్షిస్తున్నారు. ఐదు రోజులుగా ఆలయ నగరిలో ఉండి దగ్గరుండి అధికారులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.