భద్రాచలం: ఎగువన భారీ వర్షాలతో గోదావరి ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు అధికమవుతున్నది. సోమవారం ఉదయం 8 గంటలకు 39.50 అడుగులకు చేరింది. నదిలో 7,81,614 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. మరికొన్ని గంటల్లో వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకోవచ్చని కేంద్ర జల వనరుల సంఘం అధికారులు తెలిపారు. ఈ ఏడాది జూలై నెలలో ఒకసారి, ఆగస్టు నెలలో ఒకసారి గోదావరికి వరదలు వచ్చాయి.
కాగా, గోదావరిలో వరద ప్రవాహం 9 లక్షల క్యూసెక్కులకు చేరుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్తగూడెం, ములుగు సహా గోదావరి పరివాహక ప్రాంతంలోని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అధికారులను సన్నద్ధంగా ఉంచాలన్నారు. సచివాలయంలో తక్షణమే కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.