పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాను విడుదల చేసింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో కలనగుట్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రమోద్ సావంత్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న మైఖేల్ లోబో ఇటీవల కాషాయ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఉత్తర గోవాలో బలమైన నేతగా పేరొందిన లోబో బీజేపీ సర్కార్లో శాస్త్ర సాంకేతిక, వ్యర్ధాల నిర్వహణ మంత్రిగా వ్యవహరించారు.
లోబో కాంగ్రెస్లో చేరుతూ కాషాయ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.బీజేపీ సామాన్యుడి సంక్షేమాన్ని కాంక్షించే పార్టీ కాదని, కాంగ్రెస్ సామాన్యుల కోసం పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. 25కి పైగా సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ గోవాలో పాలనా పగ్గాలు చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. లోబో భార్య, పర్రా సర్పంచ్ దెలిలా కూడా బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. లోబోతో పాటు పలువురు క్రైస్తవ ఎమ్మెల్యేలు బీజేపీని వీడటం కాషాయ పార్టీలో కలకలం రేగింది.
తమ నియోజకవర్గాల్లో బీజేపీకి పట్టు లేనందునే ఓటమి భయంతో క్రైస్తవ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడారు. ఇక కాంగ్రెస్ రెండో జాబితాలో మేఘశ్యాం రౌత్, బిచోలిం అమన్ లొట్లికర్, తివిం వికాస్, ప్రభుదేశాయ్, ఆంథోనీ, ఎల్ ఫెర్నాండెజ్, ధర్మేష్ సగ్లాని, సాంక్విలిం లవు మమ్లేకర్, ప్రసాద్ గవొంకర్, జనార్ధన్ బంఢారి కనకొనాలకు చోటు దక్కింది. ఫిబ్రవరి 14న ఒకే దశలో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.