పణజీ: లైంగికదాడి కేసు నుంచి ప్రముఖ జర్నలిస్టు తరుణ్ తేజ్పాల్ను విముక్తుడిని చేస్తూ విచారణ కోర్టు ఇచ్చిన తీర్పుపై గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో అప్పీలు వేసింది. విచారణ కోర్టు తీర్పు అపోహలతో, పితృస్వామిక భావజాలంతో వెలువడిందని తన అప్పీలులో పేర్కొన్నది. ఈ కేసుపై పునర్విచారణకు ఆదేశించాలని కోరింది. బాంబే హైకోర్టు గోవా బెంచ్ ముందు ఈ అప్పీలు దాఖలైంది. డిఫెన్సు సాక్షులు చెప్పిన మాటలను వేదవాక్కులుగా తీసుకున్న విచారణ కోర్చు ప్రాసిక్యూషన్ సాక్షుల మాటలను పట్టించుకోలేదని విమర్శించింది. బాధితురాలని అడగరాని అడిగేందుకు అనుమతిస్తూ చివరకు ఆ మాటల ఆధారంగానే ఆమెపై వ్యక్తిత్వ పరమైన వ్యాఖ్యలు కోర్టు చేసిందని గోవా ప్రభుత్వం పేర్కొన్నది. నిందితుడు క్షమించమని కోరుతూ పంపిన ఈ-మెయిల్ను కోర్టు పట్టించుకోలేదని తెలిపింది. లైంగికదాడి అనంతరం బాధితురాలి ప్రవర్తన గురించి కేసులో జరిగిన చర్చ చట్టబద్ధం కాదని వివరించింది. 2013 నవంబర్లో గోవాలోని ఒక ఫైవ్స్టార్ హోటల్లో తెహెల్కా మాజీ సంపాదకుడైన తరుణ్ తేజ్పాల్ తన సహోద్యోగిపై లైంగిక దాడి జరిపారనే ఆరోపణతో ఈ కేసు దాఖలైంది. సెషన్స్ జడ్జి క్షమా జోషి గతనెల 21న తేజ్పాల్ నిర్దోషి అని తీర్పు చెప్పారు.