పనాజీ : గోవాలో ప్రస్తుతం కొనసాగుతున్న కొవిడ్ కర్ఫ్యూను ప్రభుత్వం మరో వారం పొడగించింది. ఈ నెల 23 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో గోవాలో మే 9న తొలిసారిగా కర్ఫ్యూ విధించింది. అప్పటి నుంచి పొడగిస్తూ వస్తున్నది. ప్రస్తుతం కరోనా మహమ్మారి ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో పలు ఆంక్షలు సడలింపు ఇవ్వడంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
దుకాణాలు, మాల్స్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే సెలూన్, అవుట్డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్టేడియాలు తెరుచుకున్నాయి. జిమ్లో 50శాతం సామర్థ్యంతో పని చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఇదిలా ఉండగా.. గోవా జనాభాలో 90శాతం మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. ఫ్రంట్లైన్ కార్మికులు, కొవిడ్ యోధుల కృషితో రాష్ట్రం మహమ్మారిపై పోరాడిందన్నారు. ఇదిలా ఉండగా.. ఆదివారం గోవాలో కొత్తగా 75 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.