అమెరికా : అమెరికా కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర మ్యూజిక్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ ‘సంపద’ ఆధ్వర్యంలో కర్ణాటక సంగీత సామ్రాట్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ 91వ జయంతి ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. ఈ నెల జులై 4న అంతర్జాల మాధ్యమాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది లబ్దప్రతిష్టులైన కళాకారులు హాజరై బాల మురళీ కృష్ణతో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు.
ప్రఖ్యాత వాయులీనం విధ్వాంసులు అన్నవరపు రామస్వామి మాట్లాడుతూ.. సంపద వారికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలని ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అన్నారు. బాల మురళీ కృష్ణ కారణజన్ములు అని వారికి సమకాలీకునిగా వారితో కలిసి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర విద్య నేర్చుకోవడం తమకు భగవంతుడిచ్చిన గొప్ప వరంగా పేర్కొన్నారు. ప్రముఖ నాట్యాచార్యులు పద్మా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. భగవంతుడు సంగీత ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప వరం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని తాను భావిస్తానని తెలిపారు. వారు రచించి స్వరపరిచిన హిందోళ తిల్లానాకు డాన్స్ చేసే అవకాశం తొలిసారిగా తనకు కలిగిందని గుర్తు చేసుకున్నారు.
ప్రముఖ సంగీత విద్వాంసురాలు డాక్టర్ సుధ రఘునాథన్ మాట్లాడుతూ.. బాల మురళీకృష్ణ జీవించి ఉన్న సమయంలో తను జీవించడం గొప్ప అదృష్టంగా భావిస్తానన్నారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే సామెతకు చిరునామా మంగళంపల్లి అన్నారు. ప్రముఖ వాయులీన విద్వాంసులు పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి..మాట్లాడుతూ బాల మురళీ కృష్ణ తెలుగు జాతికి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కేరళ రాష్ట్రం నుంచి మంగళంపల్లి శిష్యులు ప్రిన్స్ రామ వర్మ, హైదరాబాద్ నుంచి డీవీ మోహన కృష్ణ పాల్గొని తమ గురువుతో వారికున్న అనుభవాలని పంచుకున్నారు.
బాలమురళీ రచించి, స్వరపరచిన కీర్తనలను పాడి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ప్రముఖ మ్యూజికాలజిస్ట్ డాక్టర్ బీఎం సుందరం, డాక్టర్ పప్పు వేణుగోపాలరావు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు చిత్రవీణ రవి కిరణ్, చిత్రవీణ నరసింహం, ప్రముఖ ఘటం కళాకారులు కార్తీక్, ప్రముఖ మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ కుమార్, సంగీత విద్వాంసులు శ్రీరాం పరశురాం, మోదుమూడి సుధాకర్, వయోలిన్ కళాకారిణి పద్మ శంకర్, జీవీ ప్రభాకర్, మంగళంపల్లి వారి కుటుంబ సభ్యులు అభిరామ్, డాక్టర్ మంగళంపల్లి వంశీ, కస్తూరి గోపాల రావు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నాట్య గురువు ప్రియదర్శిని గోవింద్ సీనియర్ శిష్యురాలు శ్వేత ప్రచండె, బాలమురళీ థిల్లానాలకు తన అద్భుతమైన నాట్య ప్రదర్శనతో వీక్షకులను అలరించింది. బాలమురళి ప్రశిష్యులు చిట్టమూరి కారుణ్య, చిన్మయిలు బాలమురళీ కీర్తనలు పాడి స్వర నివాళినర్పించారు.
సంపద ఉపాధ్యక్షుడు ఫణి మాధవ్ కస్తూరి నాయకత్వంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జీవన విశేషాల పై ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రూపొందించిన డాక్యుమెంటరీలు వీక్షకులను మంత్రముగ్ధులను చేసాయి. దీనికి స్క్రిప్ట్, వాయిస్ ఓవర్ అందించిన డాక్టర్ మాలస్వామి(ఇంగ్లీష్), వాచస్పతి అంబడిపూడి మురళీకృష్ణ(తెలుగు)కు సంపద అధ్యక్షుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు
ఈ కార్యక్రమం మొత్తాన్ని సమన్వయపరిచి దిగ్విజయం చేయడానికి నాయకత్వం వహించిన సంపద అధ్యక్షుడు దీనబాబుకు మంగళంపల్లి బాలమురళీకృష్ణ శిష్యులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా సిలికానాంధ్ర వాగ్గేయకార విభాగం ఉపాధ్యక్షులు వంశీకృష్ణ నాదెళ్ళ, సృజన నాదెళ్ళ, మమత కూచిభొట్ల బాలమురళీ అభిమానులందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని youtube.com/sampadatv ద్వారా చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల