కొండాపూర్ : గ్లోబల్ వార్మింగ్ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్శశిథరూర్ పేర్కొన్నారు. బుధవారం ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ రంజిత్ రెడ్డి కమిటీ ప్రతినిధులతో కలిసి ఆయన మాదాపూర్లోని శిల్పారామం రాక్ హైట్స్ లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా శశిథరూర్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ను అదుపు చేయగల శక్తి కేవలం అడవులతోనే సాధ్యమన్నారు. ఇందుకుగాను ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు. పర్యావరణ హితం కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ను అభినందించారు. హైదరా బాద్ పర్యటనలో భాగంగా పర్యావరణ సంరక్షణకై మొక్కలు నాటే అవకాశం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా ముందుకు సాగుతుందని ఎంపీలు రంజిత్రెడ్డి సయ్యద్ జాఫర్ ఇస్లాంలు అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం స్పూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకుసాగుతుండడం, ఇప్పటికే 16 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్ష వేదం పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ స్టాండింగ్ కమిటీ సభ్యులు మహువ మొయితర, ఎంపీలు నరేంద్ర జాదవ్, సుమతి తమిజిచ్చీ తంగపాండియన్, దైర్యశీల్ సంభజీరావు మానే, శక్తిసింహ్ గోహిల్, నదిముల్ హాక్, పీఆర్ నటరాజన్, సంతోష్ పాండే, శిల్పారామం జనరల్ మేనేజర్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు..