న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో చిప్ సప్లయ్ కొరత ఇప్పట్లో పరిష్కారం కావడం కష్టమేనని గ్లోబల్ చిప్ మేకర్ ఇంటెల్ తేల్చేసింది. సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్లో చిప్ కొరత పరిష్కారం కావడానికి ఏండ్ల సంవత్సరాలు పడుతుందని ఇంటెల్ సీఈవో పాట్ గెల్సింగర్ చెప్పారు.
కరోనా మహమ్మారి ప్రభావంతో టెక్నాలజీ ఉత్పత్తులకు భారీ డిమాండ్ వచ్చింది. దీంతో చిప్లకు కొరత ఏర్పడింది. కరోనా కట్టడికి అమలులోకి వచ్చిన వర్క్/ స్టడీ ఫ్రం ధోరణులు వెలుగులోకి వచ్చాయని పాట్ గెల్సింగర్ చెప్పారు.
ఇది సెమీ కండక్టర్ల సైకిల్ గ్రోత్కు పెరుగుదలకు దారి తీసింది. తత్ఫలితంగా గ్లోబల్ సప్లయి చైన్స్కు భారీ అంతరాయం ఏర్పడిందని పాట్ గెల్సింగర్ అన్నారు.
చిప్ సరఫరాలో అవరోధాలను పరిష్కరించి, డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి పెంచడానికి తమ భాగస్వాములతో కలిసి శ్రద్ధగా పని చేస్తున్నామని తెలిపారు. కోవిడ్-19 అనంతర నూతన తరం అవసరాలను తీర్చే దిశగా తాము క్రుషి చేస్తున్నట్లు వర్చువల్ వేదికగా జరిగిన ఓ సదస్సులో చెప్పారు.
ఫౌండ్రీ సామర్థ్యం, విడి భాగాల కొరత సమస్య పరిష్కారానికి కొన్నేండ్ల టైం పడుతుందని పాట్ గెల్సింగర్ అన్నారు. గత నాలుగేండ్లలో ఇంటర్నల్ వాఫర్ కెపాసిటీని రెట్టింపు చేశామన్నారు. చిప్ల సరఫరా చెయిన్లో ఇది కీలకం కానుందన్నారు.
కంప్యూటర్లు మొదలు అప్లియెన్సెస్, కమ్యూనికేషన్ డివైజెస్, రవాణా వ్యవస్థల నుంచి కీలక మౌలిక వసతుల వరకు అన్నింటా సెమీ కండక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫౌండ్రీ సామర్థ్యం పెంపు కోసం తాము 2000 కోట్ల డాలర్ల పైచిలుకు నూతన పెట్టుబడులు పెడతామని ఇంటెల్ ప్రకటించింది.
భారీగా ఉత్పాదక శక్తి పెంపుకు వీలుగా అరిజోనా ప్రొడక్షన్ యూనిట్ను విస్తరిస్తామని పాట్ గెల్సింగర్ అన్నారు. అమెరికా, యూరప్లలోని తమ ప్రొడక్షన్ యూనిట్ల సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ప్రపంచ దేశాలకు సుస్థిర, సురక్షితమైన సెమీ కండక్టర్ల సరఫరా చెయిన్ అందుబాటులోకి తేవడమే లక్ష్యం అని చెప్పారు.