హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): కిట్టీ పార్టీలతో ఎరవేసి.. కోట్ల రూపాయలు కొట్టేసి.. కటకటాలు లెక్కిస్తున్న శిల్పా చౌదరిని 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోటీ ఐదు లక్షల రూపాయలు తీసుకొని తిరిగి ఇవ్వలేదని దివ్య అనే మహిళ ఫిర్యాదు చేయగా.. శనివారం నార్సింగి పోలీసులు శిల్పా చౌదరిని అరెస్ట్చేసి రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. ఆమె మోసాలకు సంబంధించిన పూర్తివివరాలు సేకరించేందుకు పోలీసులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. సోమవారం పిటిషన్పై వాదనలు జరిగిన తర్వాత విచారణపై స్పష్టత వస్తుందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. శిల్పా చౌదరి కేసులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఆమె వల్ల కోట్ల రూపాయల్లో మోసపోయిన బాధితులు ఫిర్యాదుచేయడానికి ముందుకు రావడంలేదు. ఐటీ కట్టకుండా దాచుకున్న డబ్బు ఆమెకు ఇచ్చినట్టు తెలుస్తున్నది. వారి ఆస్తులపై ప్రభుత్వ ఏజెన్సీల నిఘా పెరిగే అవకాశం ఉండటంతో కంప్లెయింట్కు వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం. పోలీసులు మాత్రం లోతుగా విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శిల్పా చౌదరి, ఆమె భర్త శ్రీనివాస్ చౌదరి నుంచి మూడు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ఫోన్లు తెరిచి అందులోని సమాచారంతో దర్యాప్తు చేయనున్నట్టు తెలుస్తున్నది.
బాధితుల్లో ప్రముఖ సినీహీరో బావ
శిల్పా చౌదరి మోసానికి ప్రముఖ సినీహీరో సోదరి భర్త కూడా బలైనట్టు తెలిసింది. సుమారు 6 కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడని తెలుస్తున్నది. అతనితోపాటు ఏపీకి చెందిన ఓ ఎంపీ కూడా కోట్ల రూపాయలు ఇచ్చినట్టు సమాచారం. పేరు బయటకు రాకుండా, ఫిర్యాదు లేకుండా పలుకుబడితో డబ్బులు రాబట్టుకొనేందుకు వారు నార్సింగి పోలీసుల మీద ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది.