న్యూఢిల్లీ, జూలై 22: విద్యార్థులు ఎంతో ఉత్కఠంగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల తుది ఫలితాలు వచ్చేశాయ్. ఈ రెండు తరగతుల రిజర్ట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను cbseresults.nic.in లేదా cbse.gov.in వెబ్సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు.
రెండు తరగతుల్లోనూ ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలు మెరిశారు. 10వ తరగతిలో మొత్తంగా 94.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత 95.21% ఉండగా, బాలురు 93.8% మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత 1.41% అధికంగా ఉన్నట్టు సీబీఎస్ఈ తెలిపింది. అలాగే ట్రాన్స్జెండర్లలో 90% మంది పాస్ అయ్యారని బోర్డు వెల్లడించింది. కాగా, ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ మెరిట్ లిస్టు, డివిజన్ల వారీగా మార్కులు విడుదల చేయబోదని, అనారోగ్యకర పోటీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎగ్జామ్ కంట్రోలర్ భరద్వాజ్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఫలితాలు పరిశీలిస్తే నోయిడాకు చెందిన మయాంక్ యాదవ్ అనే విద్యార్థి 500/500(100%) మార్కులు సాధించి 10 ఫలితాల్లో టాపర్గా నిలిచాడు.
12వ తరగతిలో 92.71% ఉత్తీర్ణత
ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతిలో 92.71% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. బాలురు(91.25%) కంటే బాలికల్లో(94.54%) ఉత్తీర్ణత 3.29 శాతం ఎక్కువగా ఉన్నది. 33,432 మంది విద్యార్థులు 95% పైగా మార్కులు సాధించారు. మీడియా నివేదికల ప్రకారం యువాక్షి, తాన్యా అనే ఇద్దరు విద్యార్థులు 500కి 500 తో 100 శాతం మార్కులు పొంది టాప్లో నిలిచారు.
మార్కుల వెయిటేజీ ఇలా..
కరోనా నేపథ్యంలో 2021-22 విద్యా సంవత్సరంలో బోర్డు ప్రత్యేక మదింపు విధానం చేపట్టింది. రెండు భాగాలుగా టర్మ్ 1, టర్మ్ 2 పరీక్షలు నిర్వహించారు. వీటిలో మొదటి టర్మ్ పరీక్షలు మల్టిపుల్ చాయిస్ విధానంలో, రెండో విడత పరీక్షలు వ్యాసరూప, సంక్లిప్త సమాధానాల ప్రశ్నల రూపంలో నిర్వహించారు. టర్మ్ 1 నుంచి 30%, టర్మ్ 2 నుంచి 70% మార్కుల వెయిటేజీ కలిపి తుది ఫలితాలు విడుదల చేశారు. అయితే ఈ ఏడాది నుంచి పాత పద్ధతిలోనే అకడమిక్ చివరిలో ఒక పరీక్ష మాత్రమే నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఎగ్జామ్ కంట్రోలర్ భరద్వాజ్ ధ్రువీకరించారు.