లక్నో: ప్రియురాలు వీడియో కాల్ చేయకపోవడంతో రైలు ముందు దూకి చస్తానని ప్రియుడు బెదిరించాడు. అతడు ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో అంత పని చేసి ఉంటాడని ఆందోళన చెందిన యువతి విషం సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. బరేలీలోని ఇజ్జత్నగర్కు చెందిన 17 ఏళ్ల యువతి డిగ్రీ చదువుతున్నది. అలోక్నగర్కు చెందిన 22 ఏళ్ల యువకుడి నుంచి ఒక రోజు ఆమె మొబైల్ ఫోన్కు మిస్ కాల్ వచ్చింది. నాటి నుంచి వారిద్దరికీ ఫోన్లో పరిచయం ఏర్పడింది.
కాగా, శుక్రవారం ఆ యువకుడు ఆమెకు ఫోన్ చేశాడు. వీడియో కాల్ చేయాలని ఆమెను కోరాడు. ఆ యువతి నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో రైలు ముందు దూకి చనిపోతానంటూ ఆ యువకుడు ఆమెకు మెసేజ్ పంపాడు. ఇది చూసి ఆ యువతి కంగారుపడింది. అతడికి 40 సార్లు ఫోన్ చేసింది. ఫోన్ తీయకపోవడంతో అతడు రైలు కింద పడి చనిపోయి ఉంటాడని అనుమానించింది. ఆందోళన చెందిన ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.
యువతి కుటుంబం ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారం చేసే తండ్రికి అతడు సహాయంగా ఉంటాడని పోలీసులు తెలిపారు. వీరిద్దరికీ కేవలం ఫోన్లోనే పరిచయం ఏర్పడిందని, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలుసుకోలేదని, కనీసం ముఖాలైన చూసుకోలేదని చెప్పారు. ఈ సంఘటన తర్వాత పరారైన యువకుడ్ని త్వరలో అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.