రాగిముద్దలో విషం కలిపి కుటుంబాన్నే బలితీసుకున్న బాలిక
చిత్రదుర్గ, అక్టోబర్ 19: ఆమె వయసు 17 ఏండ్లు. బాల్యమంతా అమ్మమ్మ, తాతయ్యల వద్ద గడిచింది. మూడేండ్ల కిందటే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఆమెకు సోదరుడు, సోదరి ఉన్నారు. వారిద్దర్ని చూసినంత ప్రేమగా అమ్మానాన్నలు తనను చూడటం లేదని ఆమె భావించింది. తానంటే పక్షపాతం చూపిస్తున్నారని కలత చెందింది. ఓ రోజు ఇంట్లో అందరికీ రాగిముద్ద వండి, దాంట్లో పురుగుమందు కలిపిపెట్టింది. ఆ విషాహారం తిని ఆమె తల్లిదండ్రులు, సోదరి, నానమ్మ చనిపోయారు. 19 ఏండ్ల అన్నయ్య అస్వస్థతకు గురై కోలుకున్నాడు. కుటుంబానికి విషాహారం పెట్టిన ఆ బాలిక మాత్రం ఆ రోజు సోదరి వండిన అన్నం, రసం మాత్రమే తిన్నది. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లా ఐ.సముద్ర గ్రామంలో జూలై 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వంటపాత్రలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపి పరీక్షించగా వాటిలో పురుగుమందు కలిపినట్టు నిర్ధారణ అయింది. తల్లిదండ్రులు తనను సరిగా చూసేవారు కాదని, తన తోబుట్టువులను మాత్రం ఎంతో ప్రేమగా చూసుకునేవారని, అందుకే విషం కలిపి వారిని చంపానని ఆ బాలిక విచారణలో తెలిపింది.