శ్రీశైలం : ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి కొలువై ఉన్న శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమంగా శాస్త్రోక్తంగా జరిగింది. చివరిసారిగా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గత మార్చిలో మార్చి నెలలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆ తర్వాత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రద్దు చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నిబంధనలు పాటిస్తూ.. కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం సమయంలో మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారికి మంగళహారతి ఇచ్చి, ఉత్సవమూర్తులను పల్లకీలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.
ఆ తర్వాత పల్లకీసేవ ఊరేగింపుతో గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నంది మండపం, గంగాసదనం, బయలువీరభద్రస్వామి ఆలయం, పంచ మఠాలు, మల్లమ్మ కన్నీరు, పుష్కరిణి వద్దకు, అక్కడి నుంచి తిరిగి నందిమండపం వద్దకు చేరుకుంది. నంది మండపం నుంచి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగిసింది. ప్రదక్షిణలో మల్లికార్జునస్వామి, భ్రమరాంబ అమ్మవారి నామస్మరణతో శ్రీగిరులు మార్మోగాయి. కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.