హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన వస్తువులను పండుగ బహుమతులుగా ఇవ్వడం ద్వారా ఆయా వస్తువులకు మరింత ప్రాచుర్యం లభించడమేగాక పండుగ వేడుకల్లో కొత్తదనం వస్తుందని ప్రముఖ జీఐ ప్రాక్టీషనర్, రిజల్యూట్ గ్రూప్ లీగల్ హెడ్ సుభాజిత్ సాహా పేర్కొన్నారు.
బతుకమ్మ, దసరా నేపథ్యంలో బంధుమిత్రులు, స్నేహితులకు సిల్వర్ ఫిలిగ్రీతో రూపొందించిన దుర్గామాత, చేరియాల్ పెయింటింగ్ను కానుకగా ఇవ్వాలని ఒక ప్రకటనలో సూచించారు. పోచంపల్లి, ధర్మవరం సిల్క్స్, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ చీరలు జీఐ గుర్తింపు పొంది ప్రాచుర్యం పొందినప్పటికీ చేరియాల్ పెయింటింగ్స్, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వంటి హస్తకళలు కొంత వెనుకబడ్డాయని తెలిపారు.