సిటీ బ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు చెరువులు, కుంటల్లో నీరు చేరి నిండేంత వరకు తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కానీ అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీతో నాలాల్లో నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతున్నది. వరద నీటి తీవ్రత, నీటి ప్రవాహ వేగం, రానున్న గంటలో వరద ప్రభావం వంటి అంశాలను సెన్సార్ల సాయంతో నేరుగా మొబైల్లోనే ప్రత్యేక యాప్ ద్వారా పరిశీలించవచ్చు. హుస్సేన్సాగర్ నాలాపై ఓయూ ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ అధ్యాపకుల పర్యవేక్షణలో రీసెర్చ్ స్కాలర్స్ పైలట్ ప్రాజెక్టుగా ఏడాది కాలంగా కొనసాగుతున్నది. ప్రస్తుతం వీటి ఫలితాలను విశ్లేషిస్తుండగా 98శాతం ఖచ్చితత్వంతో ఫలితాలు వస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు.
చూడటానికి సీసీ కెమెరాలో కనిపించే అల్ట్రా సోనిక్ వాటర్ లెవల్ సెన్సార్ పరికరం ద్వారా నాలా ప్రవాహాన్ని వెంటనే గుర్తించడానికి వీలు కలుగుతుంది. గంట గంటకు మారుతున్న నీటి పరిణామాన్ని పక్కాగా అంచనా వేసే వీలు ఉంది. దీని ద్వారా నాలా ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం మరింత సులభం కానున్నది.
బుల్కాపూర్, కూకట్ పల్లి నాలాలపై ఏర్పాటు
హుస్సేన్ సాగర్కు వచ్చే బుల్కాపూర్, కూకట్పల్లి నాలాలపై ఓయూ సివిల్ ఇంజినీరింగ్ శాఖ అధ్యాపకుల సమక్షంలో అల్ట్రాసోనిక్ వాటర్ లెవల్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఏడాది కాలంగా ఈ ప్రయోగం కొనసాగుతుంది. రూ.75లక్షల విలువ చేసే ఈ సెన్సార్ పక్కాగా వివరాలను గుర్తిస్తున్నది. ప్రతి నిమిషానికి ఒక్కసారి అప్డేట్ సమాచారాన్ని సంబంధిత మొబైల్ డివైజ్కు చేరవేస్తుంది. ఈ డివైజ్తో స్ట్రోమ్ వాటర్ అనాలసిస్ ప్రక్రియ సమర్థవంతంగా సాగుతుంది. ఈ డివైజ్ ద్వారా చెరువులు, కుంటల నుంచి వచ్చే వరద ముంపు ప్రాంతాల్లోనూ ప్రవాహ తీవ్రతను ఖచ్చితత్వంతో లెక్కించవచ్చు. నాలాల్లో ప్రవహించే రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాల పరిణామాన్ని కూడా లెక్కించే వీలు ఉంటుందని నిపుణులు తెలిపారు.
వరద ప్రవాహాన్ని సులభంగా అంచనా వేయొచ్చు
మూడేళ్ల ప్రాజెక్టులో భాగంగా పరిశోధన విద్యార్థులతో ఈ అధ్యయనం చేస్తున్నాం. రోజువారీ సమాచారాన్ని అధ్యయనం చేసి ఏ సమయంలో నీటి ప్రవాహం పెరుగుతున్నదని, ఎప్పుడు తగ్గుతుందనే విషయాన్ని ఇప్పటివరకు గుర్తించాం. ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా వరద తీవ్రతను తక్షణమే గుర్తించి సహాయక చర్యలను వేగవంతం చేయడానికి వీలుంటుంది. రానున్న రోజుల్లో వాటర్ క్వాలిటీని విశ్లేషించేలా ఆప్ గ్రేడ్ చేస్తాం.
– ప్రొ. గోపాల్ నాయక్, ఓయూ ఇంజినీరింగ్ హెచ్ఓడీ