అకాల వర్షంపై సకాలంలో స్పందించిన జీహెచ్ఎంసీ
ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టిన అధికారులు
నీళ్లు నిల్వకుండా పనులు, చెట్లకొమ్మల తొలగింపు
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి సిబ్బంది
ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురవగా.. అత్యధికంగా సీతాఫల్మండిలో 8.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గ్రేటర్కు ఎల్లో అలర్ట్ జారీచేశారు.
గ్రేటర్వ్యాప్తంగా భారీవర్షం కురిసింది. భారీ మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం రావడంతో వెంటనే బల్దియా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన మార్గాలు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలువకుండా 128 ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. వరద సాఫీగా పోయేలా చూడడంతోపాటు గాలులకు విరిగిపడిన చెట్లకొమ్మలను తొలగించాయి. ఒకచోట కరెంటు స్తంభం నేలకొరగగా, గోల్నాక వద్ద ఇండ్లు కూలి నలుగురికి గాయాలయ్యాయి. పురపాలక మంత్రి కేటీఆర్, ఆ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్కుమార్ ఆదేశాలతో ఉన్నతాధికారులు, సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. వర్షాల వల్ల ఏమైనా అవస్థలు ఎదురైతే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం 040-21111111ను సంప్రదించాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి నగరవాసులకు సూచించారు.
సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ): అకాల వర్షం నగరాన్ని ముంచెత్తగా జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. సకాలంలో స్పందించి సహాయక చర్యలు చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాగా.. తక్షణ, తాత్కాలిక చర్యలు చేపట్టాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్, శానిటేషన్, ఇంజినీరింగ్, యూబీడీ, డీఆర్ఎఫ్, ఎలక్ట్రిసిటీ విభాగం అధికారులు రంగంలోకి దిగారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు 128 స్టాటిక్ బృందాలను పంపారు.
అక్కడక్కడ విరిగి పడిన చెట్లను డీఆర్ఎఫ్ బృందాలు తొలగించగా.. ఇతర సమస్యల పరిష్కారానికి 128 మినీ మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు వర్షాలతో ఏవైనా సమస్యలు తలెత్తితే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం 040-2111 1111 నంబర్కు ఫోన్ చేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచించారు.
సహాయ చర్యలు ఇలా..
మరో మూడు రోజులు వర్షం..
విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం తెల్లవారుజామున నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. టీఎస్డీపీఎస్ అధికారుల వివరాల ప్రకారం సీతాఫల్ మండిలో అత్యధికంగా 8.6 సెం.మీలు, జీడిమెట్ల గాయత్రీనగర్లో అత్యల్పంగా 1.0సెం.మీల వర్షపాతం నమోదైంది. మరోవైపు మరో మూడు రోజులు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. గ్రేటర్కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.