హైదరాబాద్ : ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన నాలా పనులకు ఎలాంటి నిధుల కొరత గానీ, బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేదని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. నగరంలో వరద ముంపు నివారణకు రూ.985 కోట్లతో 60 పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు రూ. 450 కోట్ల విలువ గల బిల్లులు చెల్లింపులకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అందులో ఇప్పటికే రూ.103.19 కోట్ల విలువ గల బిల్లులు చెల్లించినట్లు స్పష్టం చేశారు. మిగతా రూ. 350 కోట్ల బిల్లులు చెల్లించేందుకు ప్రాసెస్ లో కలవు. వాటిని కూడా త్వరలో చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
నాలా పనులను ముందుగా మిషన్ మోడ్లో అనుకున్న సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ రుతుపవనాలు అడ్వాన్స్ గా ప్రవేశించడం, ఎడతెరపి లేకుండా వర్షాలు పడటం మూలంగా అనుకున్న లక్ష్యం నేరకు పూర్తి చేయలేక పోవడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ చేపట్టిన నాలా పనుల వల్ల లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహం లేకుండా చేయడం జరిగిందన్నారు. వర్షాలు కురుస్తున్నప్పటికీ పనులు చేపట్టేందుకు మెటీరియల్ సిద్ధం చేసుకున్నప్పటికీ ఎడతెరిపి లేకుండా నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలకు పనులను కొనసాగించ లేకపోయినట్లు మేయర్ వెల్లడించారు.
ఎస్ఎన్డీపీ పనుల కారణంగా కొన్ని కాలనీలలో వరద ముంపు సంభవించలేదని పేర్కొన్నారు. బంజారా కాలనీ, అంబేద్కర్నగర్, బండ్లగూడ, నాగోల్, హయత్నగర్, సింగరేణి కాలనీ, రామంతపూర్, సరస్వతి నగర్ (మన్సూరాబాద్), క్రిస్టియన్ కాలనీ (వనస్థలిపురం), కోదండరాంనగర్, పీ అండ్ టీ కాలనీ, తపోవన్ కాలనీ, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల, హబీబ్నగర్, ఇక్రిసాట్ కాలనీ, హఫీజ్బాబా నగర్ (ముర్కి నాలా వెంట ఉన్న కాలనీలు), విక్రమ్ నగర్, పాట్నీ నగర్, తదితర కాలనీల్లో ముంపు సంభవించలేదని మేయర్ స్పష్టం చేశారు.