సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జోనల్ కమిషనర్లతో మేయర్ జోనల్ వారీగా చేపట్టుతున్న సహాయక చర్యలపై సెల్ కాన్ఫరెన్స్లో సమీక్షించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
నీరు నిలిచిన ప్రాంతాల్లో వెంటనే నీటిని, నాలాలో పేరుకొని పోయిన చెత్తను తొలగించాలని పేర్కొన్నారు. మ్యాన్ హోళ్ల వద్ద చెత్త, మట్టిని తొలగించి సాఫీగా వరద పోయే విధంగా చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. అధికారులందరూ 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ, ఫిర్యాదు వచ్చిన వెంటనే క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూసీ నదిలో వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాబోయే 24 గంటల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు కరెంటు స్తంభాల వద్ద, చెట్ల కింద, నాలా పరిసర ప్రాంతాల్లో నిలబడకుండా చూడాలన్నారు.
040-21111111
040-29555500