మియాపూర్, ఆగస్టు 26 : ఐటీ జోన్లో పర్యావరణహితంగా.. కాలుష్య రహితంగా వినాయక నవరాత్రోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం అవుతున్నది. బల్దియాలో తగు గుర్తింపు కలిగిన శేరిలింగంపల్లి జోన్ ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నది. వినాయక నవరాత్రోత్సవాలతో పాటు అత్యంత కీలక ఘట్టమైన ప్రతిమల నిమజ్జనం నేపథ్యంలో చెరువులు కలుషితం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న ఉన్నత స్థానం.. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలతో ఇక్కడి జోనల్ అధికారులు తగు ఏర్పాట్లను ఇప్పటికే చేపడుతున్నారు. ఆయా విభాగాల సమన్వయంతో ఉత్సవాలను పర్యావరణహితంగా జరుపుకునేలా ప్రజలలో చైతన్యం నింపటంతో పాటు ముందస్తుగా నిమజ్జన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇందుకు గాను ఈ సారి వినాయక ప్రతిమలను పూర్తి స్థాయిలో చెరువులలో కాకుండా ప్రత్యేక పాండ్లలోనే నిమజ్జనం చేసేలా తీర్చిదిద్దుతున్నారు. జోన్ వ్యాప్తంగా 14 నిమజ్జన ప్రాంతాలను భక్తుల వెసులుబాటు కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అందులో 3 పోర్టబుల్ పాండ్స్ కాగా.. మరో 3 అప్పటికపుడు తవ్వి చేస్తున్న పాండ్లు. ఈ నెలాఖరులోగా వీటిని సిద్ధం చేసేలా కసరత్తులు చేస్తున్నారు.
14 నిమజ్జన ప్రాంతాలు..
ఈ నెల 31వ తేదీన వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్న తరుణంలో శేరిలింగంపల్లి జోనల్ స్థాయిలో ఉత్సవాలు.. నిమజ్జన ఏర్పాట్లపై తీవ్ర స్థాయిలో కసరత్తులు చేపడుతున్నారు. జోన్ వ్యాప్తంగా ఉన్న నాలుగు సర్కిళ్లలో కలిపి మొత్తం 14 నిమజ్జన పాండ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో 8 శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేసిన బీబీ పాండ్స్ కాగా.. మరో 3 పోర్టబుల్, మరో 3 ఎక్సావేషన్ పాండ్లున్నాయి. దుర్గం చెరువు, నలగండ్ల చెరువు, మల్కం చెరువు, గోపి చెరువు, గంగారం, ఖాయిదమ్మ, గురునాథం చెరువు రాయసముద్రం చెరువు సమీపంలో 8 శాశ్వత బేబీ పాండ్లున్నాయి. చందానగర్ సర్కిల్ పీజేఆర్ స్టేడియం, యూసుఫ్గూడ సర్కిల్లో రహ్మత్నగర్ క్వారీ ల్యాండ్, పటాన్చెరు సర్కిల్లో సాకీ చెరువు వద్ద పోర్టబుల్ పాండ్స్, రంగనాయకమ్మ దేవాలయం, మయూరీనగర్ పార్కు, సాకీ చెరువు వద్ద ఎక్సావేషన్ పాండ్లను ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం మట్టి వినాయక ప్రతిమల నిమజ్జనానికి చందానగర్ సర్కిల్ పరిధిలోని ప్రకాశ్నగర్ కొత్త కుంట చెరువును అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతిమల నిమజ్జనానికి 19 క్రేన్లను వినియోగిస్తున్నారు. పాండ్లు సహా చేరుకునే దారులలో 2 వేలకు పైగా వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నారు.
మట్టి గణపతులపై విస్తృత ప్రచారం..
వినాయక నవరాత్రోత్సవాలలో జోన్లో పూర్తి స్థాయిలో మట్టి వినాయక ప్రతిమలనే ప్రజలు, ఉత్సవ కమిటీలు వినియోగించాలని అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జోనల్ కార్యాలయంలో నెల ముందునుంచే మట్టి వినాయక ప్రతిమను ప్రదర్శించారు.
మట్టి వినాయకులనే పూజిద్దాం..
వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. ఇందుకుగాను ఇండ్లతో పాటు కాలనీలు, బస్తీల్లోనూ మట్టి ప్రతిమలనే వినియోగించాలని కోరారు. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. చెరువుల నీరు కలుషితం కాకుండా ఉండేందుకు నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వేడుకల అనంతరం ఇండ్ల వద్దనే మట్టి వినాయక ప్రతిమలను నిమజ్జనం చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక నవరాత్రోత్సవాలకు జోన్లో విస్తృతమైన ఏర్పాట్లు చేపడుతున్నాం. ప్రధానంగా మట్టి వినాయక ప్రతిమలనే పూజలకు వినియోగించేలా పలు మాధ్యమాల ద్వారా జోన్ వ్యాప్తంగా తగు ప్రచారం చేపట్టాం. పొదుపు సంఘాల మహిళలతో ప్రతిమలను సైతం తయారు చేయిస్తున్నాం. మాల్స్ సహా ఇతర ప్రాంతాలలో ముందస్తుగా ప్రదర్శించిన మట్టి ప్రతిమలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేశాయి. వినాయక విగ్రహాల నిమజ్జనానికి జోన్లో 14 పాండ్స్ను అందుబాటులో పెడుతున్నాం. ఈ సారి ప్రత్యేకంగా 3 పోర్టబుల్ బేబీ పాండ్లను ఏర్పాటు చేస్తున్నాం. కేవలం మట్టి వినాయక విగ్రహాల నిమజ్జనానికి కొత్తకుంట చెరువును వినియోగిస్తున్నాం.
– శంకరయ్య, జోనల్ కమిషనర్ శేరిలింగంపల్లి