న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ పోలీసులు, ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి మధ్య వివాదం మరింత ముదురుతున్నది. ఈ నెల 24వ తేదీన స్వయంగా లోనీ బోర్డర్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సోమవారం మనీశ్ మహేశ్వరికి యూపీ పోలీసులు మరో నోటీసు జారీ చేశారు.
హాజరు కాని పక్షంలో కేసు విచారణకు సహకరించడం లేదని భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. చట్ట బద్ధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవల ముస్లిం వ్యక్తిపై దాడి ఘటన మీద పలువురు వ్యక్తులు ట్విట్టర్లో పోస్ట్లు పెట్టారు. దీనిపై కేసు నమోదైంది.
ఈ కేసులో వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని మనీష్ మహేశ్వరి ఇంతకు ముందు తెలిపారు. ఇటువంటి వివాదాలతో తనకు సంబంధం లేదని, వీటిని తాన్ డీల్ చేయనని పేర్కొన్నారు.
ఆయన ఇచ్చిన జవాబుపై ఘజియాబాద్ పోలీసులు సంతృప్తికరంగా లేరని తెలుస్తున్నది. తాము ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి 26 నోటీసులిచ్చినా ఒక్కదానికి స్పందించలేదని పోలీసులు పేర్కొన్నారు.
నూతన ఐటీ రూల్స్ పాటించాలన్న విషయమై కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ట్విట్టర్కు మధ్యవర్తిత్వ హోదా తొలగించి వేసింది కేంద్రం.