హైదరాబాద్ : పెళ్లయిన జంటలు తప్పనిసరిగా జన్యు పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జెనిటిక్ డిసార్డర్ తల్లిదండ్రుల నుంచి పిల్లలు, ఆ తర్వాతి తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. దేశంలో మేనరికం, దగ్గరి బంధువులతో జరిగే వివాహాలే ఎక్కువ. దీని ద్వారా ప్రతి 30 మందిలో ఒకరు జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నట్లు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రీసెర్చ్- సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీఎస్ఐఆర్-సీసీఎంబీ) తాజా అధ్యయనంలో తేలింది.
చాలా కేసుల్లో జెనిటిక్ డిసార్డర్ తల్లిదండ్రుల నుంచి పిల్లలు, ఆ తర్వాతి తరాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. న్యూరోలాజికల్ డిసీజెస్ (నరాల బలహీనత), క్యాన్సర్లు, సికిల్ సెల్ అనీమియా, వెన్ను కండరాల క్షీణత తదితర వ్యాధులకు ఇది దారి తీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే పెళ్లయిన జంట తప్పనిసరిగా జన్యు పరీక్ష చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు.
దేశంలో దాదాపు 7 కోట్ల నుంచి 9.60కోట్ల మంది జన్యుపరమైన రుగ్మతలు కలిగి ఉన్నారని, అందుకే ప్రతి 5వేల మందిలో ఒకరు లేదా ఇద్దరు అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. జన్యు వ్యాధులను నయం చేయలేకపోయినా ముందస్తుగా గుర్తించడం, రోగనిర్ధారణ చేయడం ద్వారా వాటిని నియంత్రించవచ్చని, లేదంటే కుటుంబంలోని తరతరాలను అవి ప్రభావితం చేస్తాయని సీసీఎంబీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తరచుగా జరిగే గర్భధారణ వైఫల్యాలు, పుట్టే పిల్లల్లో గుండె సంబంధింత సమస్యలు, పుట్టుకతో వచ్చే వైకల్యాలు ఇవన్నీ జన్యుపరమైన లోపాలతోనే వస్తాయంటున్నారు.
అయితే, వీటికి పూర్తిగా నివారించే చికిత్సలు లేనప్పటికీ.. దాదాపు 800 రకాల జన్యుసమస్యలను అందుబాటులో ఉన్న ఇంజక్షన్లు, జన్యుమార్పిడి చికిత్సతో నివారించవచ్చు. రానున్న పది-పదిహేనేళ్లలో అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా ముందుజాగ్రత్త తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం హైదరాబాద్లోని సీసీఎంబీ క్యాంపస్లో జెనిటిక్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశామని, జన్యుపరమైన సమస్యలపై ఎలాంటి పరీక్షైనా ఇక్కడ చేయించుకోవచ్చని పేర్కొన్నారు.