కమలాపూర్: హజూరాబాద్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సతీమణి గెల్లు శ్వేత ఓటర్లను అభ్యర్థించారు. కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలో సోమవారం ఆమె..ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఆమెకు గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. బొట్టు పెట్టి ఇంట్లోకి ఆహ్వానించారు. గ్రామంలోని వీధివీధినా తిరిగిన గెల్లు శ్వేత.. టీఆర్ఎస్ పార్టీకే ఓటువేయాలని ప్రజలను కోరారు. తమ ఇంటికి వచ్చిన శ్వేతకు.. సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన గొర్రెపిల్లలను చూపిస్తూ యజమానులు ఆనందం వ్యక్తంచేశారు. కులవృత్తిని బతికిస్తున్న కేసీఆర్ వెంటే ఉంటామని మాట ఇచ్చారు. ఆమె వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులున్నారు.