హుజూరాబాద్టౌన్: తాను నిరుపేద బిడ్డనని, ఈ ఉప ఎన్నికల్లో ఆశీర్వదిస్తే హుజూరాబాద్ ప్రజలకు అండగా ఉంటానని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు పరిధి ఇంద్రానగర్కాలనీ, సూపర్బజార్లోని 26వ వార్డులో మంత్రి గంగుల కమలాకర్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డితో కలిసి మంగళవారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరానగర్ సిక్కులవాడలో గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడారు. తనకు యువత కష్టాలు తెలుసునని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థి నాయకుడిగా అలుపెరగని పోరాటం చేశానని తెలిపారు. తనపై ఉన్న 130కి పైగా కేసులే అందుకు సాక్ష్యమని చెప్పారు. వందల ఎకరాలున్న ఈటల రాజేందర్తో రెండు గుంటలున్న నేను పోటీపడుతున్నానంటే ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పేదింటి బిడ్డనైనా ఉద్యమంలో చేసిన సేవలకు గుర్తుగా తనకు కేసీఆర్ టికెట్ ఇచ్చారని చెప్పారు.
తాను గెలిస్తే హుజూరాబాద్ అభివృద్ధి కోసం ఏంచేస్తానో చెబుతున్నానని, కానీ ఈటల రాజేందర్ అభివృద్ధి ఊసే ఎత్తడం లేదన్నారు. తాను రాజీనామా చేయడంవల్లే ఇప్పుడు హుజూరాబాద్లో అభివృద్ధి జరుగుతున్నదంటూ ఈటల రాజేందర్ ప్రజలను బోల్తా కొట్టిస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలపై ప్రేమ ఉంటే పన్నులభారంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నబీజేపీలో ఎందుకు చేరాడో ఈటల చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈటల రాజేందర్ మాయమాటలు నమ్మి ఆయనను పొరపాటున గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందని గెల్లు శ్రీనివాస్యాదవ్ అన్నారు. తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్తో మాట్లాడి హుజూరాబాద్కు మెడికల్ కాలేజీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. 5వేల మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని చెప్పారు. ప్రతి ఇంటికీ సంక్షేమం చేరేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ను ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు అంటున్నారని గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈటల రాజేందర్కు కృతజ్ఞతాభావం లేదన్నారు. అలాంటి వ్యక్తికి ఓటేస్తే స్వలాభం తప్ప హుజూరాబాద్ అభివృద్ధి పట్టించుకుంటాడా? అనేది ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. ఈ నెల 30వ తేదీన ఓటేసేందుకు వెళ్లే ముందు ఓసారి పెరిగిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలను కోరారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో తనను గెలిపిస్తే ఈటలను రాజకీయ సమాధి చేసినట్లేనని వ్యాఖ్యానించారు.
ఈ ప్రచారంలో కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు, 13, 26వ వార్డు కౌన్సిలర్లు కొండ్ర జీవితనరేశ్, కేసిరెడ్డి లావణ్యతోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, సిద్దిపేట, కొత్తపల్లి కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.