పటాన్చెరు, ఆగస్టు 12: గీతం వర్సిటీ 42వ ఫౌండేషన్ అవార్డు-2022ను నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థికి ఇవ్వనున్నారు. ఈ నెల 13న నిర్వహించనున్న గీతం 42వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయనకు అవార్డు ఫలకంతోపాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేసిన సేవలకు గుర్తింపుగా రూ.10 లక్షల చెక్కును అందజేయనున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు
గీతం ఫౌండేషన్ అవార్డును వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి రూ.మూడు కోట్ల మూలధన నిధితో స్థాపించినట్టు ఆయన తెలిపారు. గీతం ప్రధాన కేంద్రమైన విశాఖపట్నంలో ఏటా నిర్వహించే వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్య, ఆర్థికశాస్త్రం, సైన్స్, సాహిత్యం, లలితకళలు, ప్రజాసేవ వంటి రంగాల్లో ఆయా వ్యక్తులు అందించిన ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేస్తున్నట్టు వీసీ పేర్కొన్నారు.