జీవిత పరమార్థాన్ని తెలుసుకొని, పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందాలనుకున్న వారికి విష్ణుగీత, నారద గీత, దేవీగీత, వ్యాసగీత, రుభుగీత, సిద్ధగీత, రుద్రగీత, బృహద్గీతలు ఎంతగానో ఉపయోగపడుతాయి. వేటికవే వైవిధ్యం కలిగి ఉన్నప్పటికీ, వాటిలోని వేదాంతసారం ఒక్కటే!
కర్తవ్యం విస్మరించిన అర్జునుడిని ఉద్ధరించిన గీత గురించి అందరికీ తెలుసు. కలత చెందిన రామచంద్రుణ్ని విశిష్ట మూర్తిగా తీర్చిదిద్దింది వశిష్ఠ గీత. నరుడిగా వచ్చిన నారాయణుడికి దిశానిర్దేశం చేసింది శివ గీత. జనకునికి బ్రహ్మోపదేశం అనుగ్రహించింది అష్టావక్ర గీత. శిష్యవరేణ్యుడిపై ఆశీః పూర్వకంగా కురిసింది గణేశ గీత.. ఇలా మరెన్నో! ప్రత్యేక సందర్భాల్లో ఉదయించిన ఈ దైవగీతల సారం ఒకటే! ఆ సారాన్ని మనసారా సంగ్రహిస్తే సంశయాలు తీరిపోతాయి. తలరాతలు మారిపోతాయి!
తత్వజ్ఞానం ద్వారా పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందడమే జీవిత లక్ష్యమని భారతీయుల విశ్వాసం. ‘విద్యలలో నేను అధ్యాత్మ విద్యను’ అని శ్రీకృష్ణుడు గీతలో పలికాడు. సనాతన ధర్మంలో ముమ్మాటికి ఆత్మవిద్యదే అగ్రతాంబూలం. దానిని పొందడానికి వేదాలు, ఉపనిషత్తులను ఆశ్రయించాలి. కానీ, వేదసారాన్నీ, ఉపనిషత్తుల భావాన్నీ, పురాణ వాఙ్మయంలోని విజ్ఞాన సర్వస్వాన్నీ ఈ దైవగీతలు అనుగ్రహిస్తాయి. మనసులో గూడుకట్టుకొని ఉన్న సంశయాలన్నిటినీ పటాపంచలు చేసి కర్తవ్యాన్ని బోధిస్తాయి. సత్కర్మలు ఆచరించేలా ప్రోత్సహిస్తాయి.
సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలనుకున్న వారికి, ముఖ్యంగా జీవిత పరమార్థాన్ని తెలుసుకొని, పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందాలనుకున్న వారికి భగవద్గీత, వశిష్ఠ గీత, అష్టావక్ర గీత, గణేశ గీతలే కాకుండా విష్ణుగీత, నారద గీత, దేవీగీత, వ్యాసగీత, రుభుగీత, సిద్ధగీత, రుద్రగీత, బృహద్గీతలు ఎంతగానో ఉపయోగపడుతాయి. వేటికవే వైవిధ్యం కలిగి ఉన్నప్పటికీ, వాటిలోని వేదాంతసారం ఒక్కటే!
అయోధ్యలో దశరథుడు కొలువుదీరి ఉన్నాడు. ఉరుము లేని పిడుగులా విశ్వామిత్రుడు వచ్చాడు. యాగ రక్షణ కోసం రామలక్ష్మణులను వెంట పంపమన్నాడు. దశరథుడు ఒప్పుకోడు. వశిష్ఠుని ఆదేశాలతో సమ్మతిస్తాడు. తండ్రి ఆజ్ఞతో రాముడు సభకు వస్తాడు. కానీ, అతని మోము కళ తప్పి కనిపిస్తుంది. ఏదో దీర్ఘాలోచన, ఇంకేదో దుఃఖం రాముణ్ని పట్టి పీడిస్తున్నాయి ఆ సమయంలో. అంతకు కొన్నాళ్ల ముందు రాముడు తీర్థయాత్రలు చేసి లోకాన్ని నిశితంగా పరిశీలిస్తాడు. ప్రపంచమంతా దుఃఖ భరితంగానే కనిపిస్తుంది. ఆ అనుభవాలే బాలరాముడిలో వైరాగ్య భావనలకు కారణం. సభలో అన్యమనస్కంగా నిల్చున్న రాముడితో ‘వత్సా! ఎందుకీ నైరాశ్యం’ అంటాడు విశ్వామిత్రుడు. అప్పుడు రాముడు ‘సంసారంలో దుఃఖం లేకుండా జీవించే ఉపాయం చెప్పమ’ని కోరతాడు. విశ్వామిత్రుని కోరిక మేరకు వశిష్ఠుడు రాముడికి తత్వోపదేశం చేస్తాడు. అదే వశిష్ఠ గీత. ఆరు అధ్యాయాలతో రామచంద్రుని వ్యక్తిత్వాన్ని విశిష్టంగా మార్చిన రాత. రామచంద్రుని సంశయాలనే కాదు, ఆధ్యాత్మిక సాధనలో సామాన్యుడి అనుమానాలనూ పటాపంచలు చేస్తుంది. వశిష్ఠ గీతకే.. ‘యోగ వాశిష్ఠం’ అని పేరు.
నారాయణుడైనా రాముడు నరుడిగానే ప్రవర్తించాడు. అరణ్యవాసంలో తన భార్య అపహరణకు గురైతే ‘సీతా! సీతా!’ అంటూ అలసిపోయేలా అడవంతా తిరిగాడు. ‘ఈ జీవితం ఇంకెందుకు?’ అనుకొని నైరాశ్యంలో కూరుకుపోయాడు. అప్పుడు అగస్త్యుడు వచ్చి రాముణ్ని ఊరడిస్తాడు. రాముడు శివుని గురించి తపస్సు చేయగా, పరమేశ్వరుడు పార్వతీసమేతంగా ప్రత్యక్షమై దివ్యాయుధాలను అనుగ్రహిస్తాడు. వాటిని స్వీకరించిన రాముడు తన సందేహాలను శివుని ముందు ఉంచగా, వాటికి పరమేశ్వరుడు సమాధానం చెబుతాడు. రామచంద్రునిలో ఆత్మ చైతన్యాన్ని ఉద్దీపింపజేసిన ప్రబోధ గీతే శివగీతగా లోక ప్రసిద్ధి చెందింది. ఈ శివగీత వ్యాసకృతమై పద్మ పురాణంలోని ఉత్తర ఖండంలో కనిపిస్తుంది. శివగీత.. శివభక్తి ప్రాధాన్యాన్ని సంతరించుకుని ఉంటుంది. భగవంతుని సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి శరణాగతి కన్నా మించిన భక్తి లేదని చెబుతుంది. శరణాగతి వల్ల పరమేశ్వరుడే మన బాగోగులు చూసుకుంటాడని తెలియజేస్తుంది.
జనకుడి రాజసభకు ఓ పండితుడు వస్తాడు. ప్రసంగవశాన ‘గుర్రపు రికాబులో కాలుంచినంత సమయంలో బ్రహ్మోపదేశం పొందవచ్చున’నే శాస్త్ర వచనాన్ని చెబుతాడు. మాటైతే అంటాడు కానీ, దానిని రుజువు చేయలేకపోతాడు పండితుడు. ఆ శాస్త్ర వచనాన్ని రుజువు చేయమని రాజ్యంలోని పండితులను కోరతాడు జనకుడు. ఈ విషయం అష్టావక్ర మునికి తెలుస్తుంది. శరీరంలో ఎనిమిది వంకలున్న అష్టావక్రుడు మిథిలకు చేరుకుంటాడు. శాస్త్ర వచనాన్ని రుజువు చేయగలనని చెబుతాడు. జనకుడు ఒక రికాబులో కాలు ఉంచి గుర్రం ఎక్కడానికి సిద్ధపడతాడు. ముని ఏం చెబుతాడా అని ఎదురుచూస్తూ ఉంటాడు. ఆ మరుక్షణం అష్టావక్రుడు అంతర్ధానమైపోతాడు. మరుసటి రోజు మళ్లీ ప్రత్యక్షమవుతాడు. ముని రాకకోసం నిశ్చలస్థితిలో ఉన్న జనకుని చూస్తాడు అష్టావక్రుడు. ఆయనకు బ్రహ్మోపదేశానికి ఇదే సరైన సమయమని భావిస్తాడు. ఆక్రమంలో జనకుడు, అష్టావక్రుడి సంవాదమే అష్టావక్ర గీతగా అవతరించిది. 20 అధ్యాయాలున్న ఈ గీతలో అద్వైత వేదాంతం, ఆధ్యాత్మిక విషయాలపై స్పష్టమైన విశ్లేషణ ఉంటుంది.
గణేశ పురాణంలో గణేశ గీత ఒక ఘట్టం. వినాయకుడు తన శిష్యుడైన వరేణ్యునికి చేసిన ఉపదేశం ఇది. భగవద్గీతలా ఇందులోనూ భక్తి, జ్ఞాన, కర్మ యోగ సంబంధ విషయాలు కనిపిస్తాయి. యోగం అంటే లౌకిక సుఖాలను అనుభవించడం కాదు, మూడు దుఃఖాల నుంచి బయట పడాలని సూచిస్తుంది. శివుడు, విష్ణువు, శక్తి, గణపతి మొదలైన పేర్లన్నీ పరబ్రహ్మకు చెందినవి. ఆ దేవతామూర్తుల విషయంలో అభేదాన్ని తెలుసుకోవడమే యోగమని విశ్లేషించింది గణేశ గీత. భగవంతుని అనుగ్రహానికి నిశ్చలమైన భక్తిని మించిన ప్రత్యామ్నాయం లేదని తేల్చిచెప్పింది.
కురుక్షేత్రం కోలాహలంగా ఉంది. సమరోత్సాహంతో కదనరంగంలోకి ప్రవేశించాడు పార్థుడు. కృష్ణ పరమాత్మ సారథిగా ఉన్నాడన్న ధీమా. జెండాపై కపిరాజు అండ ఉండనే ఉంది. అన్నిటినీ మించి ధర్మం తన పక్షం ఉందన్న నమ్మకం. కురుసేనలపై విరుచుకుపడే సంకల్పంతో రణభూమిలోకి వచ్చాడు. ఎదురుగా పితామహుడు భీష్ముడు, గురువర్యులు ద్రోణ-కృపాచార్యులు, శత సోదరులను చూడగానే హతాశుడయ్యాడు. ఒక్కసారిగా కుంగిపోయాడు కుంతీసుతుడు. అప్పటిదాకా ఉన్న ఉత్సాహం అయినవారిని చూడగానే ఆవిరైపోయింది. భీష్ముని వారసులపై విల్లు ఎక్కపెట్టలేనని భీష్మించాడు. రథం వెనక్కి మళ్లించమని కృష్ణుడిని అభ్యర్థించాడు.
అర్జునుడి దురవస్థను అర్థం చేసుకున్నాడు కృష్ణుడు. మనసుకు మాయతెరను కప్పుకొన్న పార్థుడిని ఆ చెర నుంచి విముక్తి చేయాలని సంకల్పించాడు. భగవద్గీతను ఉపదేశించాడు. పద్దెనిమిది అధ్యాయాలనే పదునైన అస్ర్తాలుగా మలచి ధనుంజయుడిని పట్టుకున్న సంకెళ్లను తెగ్గొట్టాడు. కర్మ, జ్ఞాన, సన్న్యాస తదితర యోగాలను గురించి విడమరచి చెప్పి ఐహిక మోహాలను విడవమని బోధించాడు. విషాదయోగంలో పడ్డ అర్జునుడితో ‘నీకు కర్మ మీద అధికారం ఉంది. దాని ఫలం నీ చేతిలో లేదు. ఫలాపేక్ష లేని సత్కర్మకే కర్మయోగమని పేరు. ప్రకృతికి, పరమేశ్వరునికి గల తారతమ్యమే వివేకం. ఆ వివేకమే జ్ఞాన యోగం. సర్వసంగ పరిత్యాగమే సన్న్యాస యోగం’ అని ఉపదేశించి సవ్యసాచిని సక్రమ మార్గంలోకి నడిపించాడు. యుద్ధానికి పురిగొల్పి.. ఆర్జునుడి ద్వారా ధర్మ సంస్థాపన పాంచజన్యాన్ని పూరించాడు. భగవద్గీత ఉపదేశించి అర్జునుడికే కాదు, సమస్త లోకాలకు జగద్గురువయ్యాడు.
మసన చెన్నప్ప
98856 54381