Gautam Adani | దేశీయ స్టాక్మార్కెట్లు ఈ ఏడాది భారీగా పతనమైనా.. సంపన్నులకు.. భారతీయ కుబేరుడు గౌతం అదానీ వంటి వారికి అద్భుతమైన లాభాలు తెచ్చి పెట్టాయి. ప్రపంచంలోనే మూడో సంపన్నుడిగా నిలిచిన గౌతం అదానీ గ్రూప్ సంస్థల సంపద (మార్కెట్ క్యాపిటలైజేషన్) 141 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్లో 79 శాతం. 2022లో ఇప్పటి వరకు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ రూ.12.74 లక్షల కోట్లు. అదానీ గ్రూప్కు చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.05 లక్షల కోట్లు. ఇదిలా ఉంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్ఐసీ, హెచ్సీఎల్ టెక్ వంటి సంస్థలు రూ.8 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
అదానీ గ్రూప్ కంపెనీలో ఏడు సంస్థలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అవి అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్, అదానీ విల్మార్. మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ దిశగా అదానీ గ్రూప్ అడుగులేస్తున్న తరుణంలో రెండేండ్లుగా ఆ గ్రూప్లోని కొన్ని సంస్థలు వెయ్యి శాతానికి పైగా పెట్టుబడులు పెంచుకున్నాయి.
ఈ ఏడాదిలోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ పెరగడంలో అదానీ గ్రూప్ సంస్థలు కీలకపాత్ర పోషించాయి. ప్రస్తుతం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.278 లక్షల కోట్లు. ఇంతకుముందు గత జనవరి 17న రూ.280 లక్షల కోట్ల గరిష్ట స్థాయికి చేరింది. తిరిగి గత నెల 18న గత రికార్డును బ్రేక్ చేసిన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ రూ.280.5 లక్షల కోట్లకు దూసుకెళ్లింది.
2022లో ఇప్పటి వరకు బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12.74 లక్షల కోట్లు పెరిగింది. అందులో అదానీ గ్రూప్ (ఏడు సంస్థల) ఎం-క్యాప్ రూ.10.05 లక్షల కోట్లు. ఇది బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ వృద్ధిలో 79 శాతం. గత రెండేండ్లలో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 112 బిలియన్ డాలర్లు పెరిగింది. అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ వ్యక్తిగత సంపద 365 శాతం పైపైకి దూసుకెళ్లింది.
అదానీ గ్రూప్ కంపెనీల పెరుగుదలతో ప్రపంచ కుబేరుల్లో గౌతం అదానీ మూడో స్థానానికి దూసుకెళ్లారు. బ్లూంబర్గ్ ఇండెక్స్ ప్రకారం టాప్-10 సంపన్నుల్లో వ్యక్తిగత సంపద పెంచుకున్న కుబేరుడు గౌతం అదానీ ఒక్కరే. ఈ ఏడాదిలో గౌతం అదానీ వ్యక్తిగత సంపద 64.4 బిలియన్ డాలర్లు పెరిగితే, రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 1.1 బిలియన్ డాలర్లు మాత్రమే పెరగడం గమనార్హం.