ముంబై: ఇటీవలే ఆసియా అపర కుబేరుడిగా మారిన ఆదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి సోమవారం గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్సెస్డీఎల్) షాక్ ఇచ్చింది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో భారీ పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల ఖాతాలను ఎన్సెస్డీఎల్ స్తంభింపజేసిందని ఓ ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం పేర్కొంది.
నూతన మార్కెట్ నిబంధనల ప్రకారం ఎఫ్ఐపీల కస్టమర్ డాక్యుమెంటేషన్ను వెల్లడించడం తప్పనిసరి. అంటే ఫండ్ మేనేజర్స్, కామన్ ఓనర్షిప్ వంటి వివరాలు తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
ఎఫ్ఐపీల కస్టమర్ డాక్యుమెంటేషన్ వివరాలను ఆదానీ గ్రూప్ బహిర్గతం చేయలేదు. అలా చేయనందునే ఆ మూడు ఎఫ్పీఐ డీమ్యాట్ ఖాతాలను ఎన్సెస్డీఎల్ ఫ్రీజ్ చేసింది.
ఆదానీ గ్రూప్లో పెట్టుబడి పెట్టిన ఎఫ్పీఐల ఖాతాలను స్తంభింప చేసిన వార్తలు వెల్లడి కావడంతో స్టాక్ ఎక్స్చేంజీల్లో ఆ గ్రూప్ షేర్లు కుప్ప కూలాయి. కేవలం గంట లోపే గ్రూప్ షేర్లన్నీ ‘లోయర్ సర్క్యూట్’ను తాకాయి.
దీంతో గౌతం ఆదానీ నికర సంపద దాదాపు రూ.55వేల కోట్ల (760 కోట్ల డాలర్లు) మేర ఆవిరైపోయింది. అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఖాతాలను ఎన్సెస్డీఎల్ స్తంభింప చేసింది. ఈ నాలుగు ఆదానీ గ్రూప్ కంపెనీల్లో రూ.43,500 కోట్ల విలువైన షేర్లున్నాయి.
అయితే మనీ లాండరింగ్ నివారణ చట్టం ప్రకారం ఈ ఖాతాల యాజమాన్యం పూర్తి వివరాలను ఆదానీ గ్రూప్ వెల్లడించలేదు. దీంతో మే 31, అంతకంటే ముందే వీటిని ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తున్నది. ఖాతాలు స్తంభించడం వల్ల ఈ ఫండ్స్ పాత సెక్యూరిటీలను అమ్మడండానికి గానీ, కొత్త సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి గానీ వీలు కాదు.
స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రిజిస్ట్రేషన్ ప్రకారం.. ఈ 3 ఎఫ్పీఐ కంపెనీలకు మారిషస్లోని పోర్ట్లూయిస్లోని ఒకే అడ్రస్ ఉంది. వీటికి ప్రత్యేక వెబ్సైట్లూ లేవు. అంటే డొల్ల కంపెనీలతో పెట్టుబడులు పెట్టి ఉంటారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ మూడు ఫండ్ కంపెనీలకు కలిపి ఆదానీ ఎంటర్ప్రైజెస్లో 6.82 %, ఆదానీ ట్రాన్స్మిషన్లో 8.03%, ఆదానీ టోటల్ గ్యాస్లో 5.92%, ఆదానీ గ్రీన్లో 3.58శాతం% షేర్లు ఉన్నాయి. మరోవైపు గతేడాది ఆదానీ గ్రూప్ షేర్లు 200 నుంచి 1000% మేర పెరిగాయి. దీనిపై సెబీ దర్యాప్తు సాగుతున్నట్లు సమాచారం.
ఈ వార్తల నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు అమాంతం పడిపోయాయి. స్టాక్ మార్కెట్లలో ఆరు ఆదానీ గ్రూప్ సంస్థల షేర్లు లిస్టింగయి ఉన్నాయి. కానీ ఇవి కేవలం గంటలోపు లోయర్ సర్క్యూట్ లెవల్ను తాకాయి.
ఉదయం 10 గంటలకు అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 25% పతనమై రూ.1,201.10 కనిష్ఠ స్థాయిని తాకింది. ఆదానీ పోర్ట్స్, ఆదానీ గ్రీన్ ఎనర్జీ, ఆదానీ టోటల్ గ్యాస్, ఆదానీ పవర్, ఆదానీ ట్రాన్స్మిషన్ షేర్లూ పతనమయ్యాయి.