14.2 కిలోల సిలిండర్పై రూ.25 పెంపు
రూ.871.50కి చేరిన ఎల్పీజీ ధర
3 నెలల్లో రూ.225 పెరిగిన గ్యాస్ ధర
మోదీ ఏడేండ్ల పాలనలో రూ.457 పెరిగిన ధర
అడ్డూ అదుపూలేకుండా పెరుగుతున్న వంట గ్యాస్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలోనే ప్రజలపై మళ్లీ అదనపు భారం పడింది. నాలుగు రోజుల వ్యవధిలోనే చమురు కంపెనీలు వంట గ్యాస్ సిలిండర్ ధరను మరో రూ.25 పెంచేశాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ (ఉజ్వల పథకం కింద వచ్చే సబ్సిడీతో కలిపి) ధర రూ.871.50కు చేరుకున్నది.
గతేడాది నవంబర్లో రూ.646.50గా ఉన్న సిలిండర్ ధర.. 3 నెలల వ్యవధిలో ఏకంగా రూ.225 పెరిగి ప్రస్తుతం రూ.871.50కు చేరింది. మోదీ సర్కార్ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన సమయంలో (జూన్, 2014లో) 14.2 కిలోల సిలిండర్ ధర రూ.414 ఉండగా, రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలో (జూన్, 2019లో) సిలిండర్ ధర రూ.500గా ఉన్నది. ప్రస్తుతం ఈ ధర రూ.871.50కు చేరుకున్నది. అంటే మోదీ ఏడేండ్ల పాలనలో వంటగ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.457.50 పెరిగింది.
న్యూఢిల్లీ, మార్చి 1: చమురు కంపెనీలు వంట గ్యాస్ సిలిండర్ ధరను మరో రూ.25 పెంచేశాయి. తాజా పెంపుతో ఢిల్లీలో 14.2 కిలోల ఇండ్లల్లో వినియోగించే సిలిండర్ (ఉజ్వల పథకం కింద వచ్చే సబ్సిడీతో కలిపి) ధర రూ.819కు పెరిగింది. హైదరాబాద్లో రూ.871.50కు చేరుకున్నది. అలాగే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర మరో రూ.95 పెరిగి రూ.1,614కు చేరింది. నెలరోజుల వ్యవధిలో సిలిండర్ ధర రూ.125 పెరుగడం గమనార్హం. గత నెల 4న చమురు సంస్థలు ఒక్కో సిలిండర్పై రూ.25 పెంచగా.. 15న మరో రూ.50ను వడ్డించాయి. 25న మరో 25 రూపాయలను పెంచాయి. తాజాగా మరో రూ.25ను పెంచాయి.
మూడు మాసాల్లో రూ.225 పెంపు
ఇండ్లల్లో వినియోగించే సిలిండర్ ధరలు గత మూడు నెలల కాలంలో విపరీతంగా పెరిగాయి. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఒక్కో సిలిండర్ ధర రూ.225 వరకు పెరుగడం సాధారణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. డిసెంబర్ 1, 2020న రూ.50 ను కంపెనీలు వడ్డించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.644కు చేరింది. ఆ తర్వాత ఐదు దఫాల్లో ధరలను పెంచడంతో ప్రస్తుతం ఒక్కో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.819కు చేరింది.
ఏడేండ్లలో 457.50 పెరుగుదల
మోదీ సర్కార్ తొలిసారిగా అధికారంలోకి వచ్చిన సమయంలో (జూన్, 2014లో) 14.2 కిలోల సిలిండర్ ధర రూ.414 ఉండగా, రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలో (జూన్, 2019లో) సిలిండర్ ధర రూ.500గా ఉన్నది. ప్రస్తుతం ఈ ధర రూ.871.50 కు చేరుకున్నది. అంటే మోదీ ఏడేండ్ల పాలనలో వంటగ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.457.50 పెరిగింది.