కరీంనగర్ కార్పొరేషన్, మే 9 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు నిర్వహించుకొవాలన్న ధ్యేయంతోనే ప్రభుత్వం పని చేస్తున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టంచేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిరుపేద ముస్లింలు రంజాన్ సంతోషంగా నిర్వహించుకోవాలనే సీఎం కేసీఆర్ ఈ గిఫ్ట్లను అందిస్తున్నారని చెప్పారు. జిల్లాలో అన్ని మతాలు, కులాలవారు సామరస్యంగా జీవిస్తున్నారని.. శాంతియుత వాతావరణంలో జిల్లా అభివృద్ధిలో పరుగులు తీస్తున్నదన్నారు. కొందరు చిచ్చుపేట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు వారిని పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు.