న్యూఢిల్లీ : జంట హత్యల కేసులో ఢిల్లీలోని తిహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, మాజీ ఆర్జేడీ ఎంపీ మహ్మద్ షాహాబుద్దీన్ కరోనా బారిపడ్డారు.
బుధవారం ఆయనకు వైద్యులు పరీక్ష నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో భారీ పోలీసుల బందోబస్తు నడుమ అతడిని చికిత్స నిమిత్తం స్థానిక డీడీయూ ఆసుపత్రికి తరలించారు.
షాహాబుద్దీన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జైలు అధికారులు తెలిపారు.
2004లో జరిగిన జంట హత్యల కేసులో షాహాబుద్దీన్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. దోపిడీ చేసిన సొమ్మును ఇవ్వనందుకు తన ఇద్దరు సోదరులను షాహాబుద్దీన్ హతమార్చాడు.
బీహార్లోని జిరాడే నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా.. సివాన్ లోక్సభ స్థానం నుంచి నాలుగుసార్లు ఎంపీగా షాహాబుద్దీన్ ఎన్నికయ్యాడు.
జైళ్ల సామర్థ్యానికి మించి ఖైదీల సంఖ్య..
తిహార్లోని మూడు జైళ్లలో ఇప్పటికే చాలా మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. ఈ నెల 12 నాటికి 59 మంది ఖైదీలు ఏడుగురు జైలు సిబ్బందికి వైరస్ సోకింది.
ఏప్రిల్ 17 నాటికి ఈ సంఖ్య రెట్టింపైంది. ఢిల్లీలోని తిహార్, రోహిని, మండోలి జైళ్లలో దాదాపు 18,900 మంది ఖైదీలను ఉంచారు. ఈ మూడు జైళ్ల పూర్తి సామర్థ్యం 10,026 మంది మాత్రమే.