రాంనగర్ : కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గణేశ్ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. గురువారం కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలో గణేశ్ మండపాల నిర్వాహకులతో సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా కొనసాగే శోభాయాత్రతో పాటు నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
అల్లర్లు జరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. నిమజ్జనం సందర్భంగా ఉత్సవ కమిటీలకు చెందిన సభ్యులు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రేన్ల సిబ్బందికి విగ్రహాలను అప్పగించాలని, విగ్రహాలతో పాటు క్రేన్లలోకి వస్తామని ఒత్తిడి చేయవద్దని సూచించారు. గతంలో జరిగిన కొన్ని ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఏవైనా నీటమునిగే ప్రమాదాలు సంభవించినట్లయితే వారిని రక్షించేందుకు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని చెప్పారు. మద్యం, మత్తు పదార్థాలు సేవించకుండా భక్తిశ్రద్ధలతో నిమజ్జనం సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. మధ్యాహ్నం 3 గంటల నుండి నిమజ్జనం కోసం శోభాయాత్రలను ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎస్ శ్రీనివాస్, టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు నరేశ్, లక్ష్మణ్బాబు, దామోదర్రెడ్డిలతోపాటు పలువురు పోలీసు అధికారులు, గణేశ్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.