‘గణపతి బప్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా..’ ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై’ అనే నినాదాలతో భైంసా పురవీధులు మారుమోగాయి. నవరాత్రులు విశేష పూజలు అందుకున్న గణనాథులు గురువారం నిమజ్జనానికి తరలాయి. ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, యువకుల కేరింతలు, చిన్నారుల చిందుల మధ్య శోభాయాత్ర కొనసాగింది. గడ్డెన్న, సుద్దవాగుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేయగా.. వినాయకా సెలవిక అంటూ భక్తులు వీడ్కోలు పలికారు. కాగా.. ఎస్పీ, ఏఎస్పీల ఆధ్వర్యంలో 600 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
భైంసా/భైంసా టౌన్, సెప్టెంబర్ 8 : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో గురువారం గణేశ్ నిమజ్జనం వైభవంగా జరిగింది. గణేశ్నగర్లోని మున్నూరుకాపు సంఘ భవనంలో ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద స్థానిక ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఎస్పీ ప్రవీణ్కుమార్, హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు విలాస్ గాదేవార్, బబ్రు మహారాజ్, డాక్టర్ నగేశ్, డాక్టర్ రామకృష్ణగౌడ్, కాంగ్రెస్ నాయకులు రామారావు పటేల్, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, బీజేపీ నాయకులు మోహన్రావు పటేల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, నాయకులు రాము, భట్టిగల్లి మున్నురుకాపు సంఘం అధ్యక్షుడు మల్లేశ్తోపాటు ప్రముఖుల ఆధ్వర్యంలో మంగళహారతులు ఇచ్చి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. భారీ గణేశ్ ప్రతిమలను క్రేన్, ట్రాక్టర్లతో తరలించి నిమజ్జనం చేశారు. నిమజ్జనం సందర్భంగా పురవీధులు కోలాహలంగా మారాయి. బాల గణేశ్ మండళ్లు, పలు యువజన సంఘాలు ప్రతిష్ఠించిన వినాయక ప్రతిమలను ఉదయం 10 గంటల నుంచి నిమజ్జనం చేయడం ప్రారంభించారు. గడ్డెన్నవాగుకు చేరుకున్న వాహనాలను వరుస క్రమంలో అనుమతించి నిమజ్జనం చేశారు.
ఆకట్టుకున్న శోభాయాత్ర..
నిమజ్జన శోభాయాత్ర పలువురిని ఆకట్టుకుంది. బ్యాండు మేళాలు, తాషా వంటి వాటితో యువకులు, మండళ్ల సభ్యులు నృత్యాలు చేశారు. కేరింతలు కొడుతూ హుషారుగా కనిపించారు. యువత నృత్యాలు చేస్తూ సెల్ఫీల్లో బంధిస్తూ ఆనందంగా గడిపారు. యువకులకు గణేశ్ మండలి, లక్ష్మీనర్సింహాస్వామి యోగా గ్రూప్, హనుమాన్ చాలీసా, యువజన సంఘాల సభ్యులు పులిహోర, ఉప్మాను పంచారు. కాగా.. గణేశ్ మండలీలకు మున్సిపల్ అధికారులు స్వాగతం పలుకగా.. పోలీస్స్టేషన్ సమీపంలో పోలీసులు, పురాణాబజార్లో హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి మండలీల సభ్యులను సన్మానించారు. ఉత్సవ కమిటీ, మండళ్ల సభ్యులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు శోభాయాత్రను ముందుకు నడిపించారు. నిమజ్జనోత్సవానికి ఎస్పీ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు ఏఎస్పీలు, సుమారు 600 సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షించారు. గతంలో భైంసాలో పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్లు బందోబస్తులో పాల్గొన్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులు సమాచారాన్ని కంట్రోల్ రూమ్కు చేరవేశారు.