ఏకదంతం మహాకాయం, తప్తకాంచన సన్నిభమ్,
లంబోదరం విశాలాక్షం, వందేహం గణనాయకమ్.
మౌంజీ కృష్ణాజినధరం, నాగయజ్ఞోప వీతినమ్,
బాలేందు శకలం మౌళౌ, వందేహం గణనాయకమ్.
చిత్రరత్న విచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్,
కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్.
గజవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్,
పాశాంకుశధరం దేవం, వందేహం గణనాయకమ్.
మూషికోత్తమమారుహ్య దేవాసుర మహాహవే,
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్.
యక్షకిన్నర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా,
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్.
అంబికా హృదయానందం, మాతృభిః పరివేష్టితమ్,
భక్తప్రియం మదోన్మత్తం, వందేహం గణనాయకమ్.
సర్వవిఘ్నహరం, సర్వవిఘ్న వివర్జితమ్,
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణనాయకమ్.
గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ సతతం నరః,
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్.
వినాయకుని మట్టి ప్రతిమ, పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, బియ్యం, రెండు దీపపు కుందులు, వత్తులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, కొబ్బరికాయలు, కలశం, ఆచమన పాత్రలు (గ్లాసులు), మూడు ఉద్ధరిణులు (చెంచాలు), ఆచమనానికి ఒక పళ్లెం, 21 రకాల పత్రి, నైవేద్యానికి పండ్లు, వివిధ రకాల పూలు, తమలపాకులు, వక్కలు సిద్ధంగా ఉంచుకోవాలి.
పంచామృతం
ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార కలిపి చేసుకోవాలి.
వస్త్రములు
పత్తితో చేయవచ్చు.
మధుపర్కాలు
పత్తితో చేయవచ్చు.
యజ్ఞోపవీతం
పత్తితో చేయవచ్చు.
పసుపుముద్దతో వినాయకుడిని చేయాలి. ఒక పీటమీద కొద్దిగా బియ్యం పరచి, పూర్ణకుంభం (వెండి లేదా రాగి లేదా యథాశక్తి చెంబు)లో కొత్త బియ్యం వేసి, వినాయకుని విగ్రహం పెట్టి అలంకరించండి. మామిడాకులు, వివిధ రకాల ఆకులు, లేతగడ్డి ఆకులు, పూలు, పండ్లతో పాలవెల్లి అలంకరించాలి. గొడుగు పెట్టాలి.
మహా నైవేద్యం –
నేతితో చేసిన 12 రకాల వంటకాలు. వీలు కాకపోతే శక్తిమేరకు రకరకాల పిండివంటలు చేయవచ్చు. తర్వాత ఒక గ్లాసులో మంచినీళ్లు పోసుకొని, అందులో ఓ పుష్పం, ఉద్ధరిణి (చెంచా) ఉంచుకోవాలి.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
ఉ. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయుగజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్
చం. తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన జేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా
క. తలచితినే గణనాథుని! తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా!
దలచితినే హేరంబుని! దలచితి నా విఘ్నములను తొలగించుటకున్ !!
క. అటుకులు కొబ్బరి పలుకులు! చిటి బెల్లము నానబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్ర సుతునకు! పటుతరముగ విందు చేసి ప్రార్థింతు మదిన్!
దీపారాధన
శ్లో॥ భో దీపదేవీ రూపస్త్వం కర్మసాక్షి హ్యవిఘ్నకృత్
యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ॥
దీపారాధన ముహూర్తః సుముహోర్తోస్తు.
ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అని 3 సార్లు జలం తాగాలి). ఓం గోవిందాయ నమః (ఒకసారి నీటిని పళ్లెంలో వదలాలి), ఓం విష్ణవేనమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయనమః, ఓం జనార్దనా య నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః (అనుకుని కొద్దిగా నీళ్లు తలపై చల్లుకోవాలి)
శ్లో॥ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోపివా
యః స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరః శుచిః
(ఈ మంత్రం చదివి చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని కింది మంత్రాన్ని పఠించాలి)
ప్రాణాయామం
శ్లో॥ ఉతిష్ఠంతు భూత పిశాచాః యేతే భూమిభారకాః
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥
కొన్ని అక్షతలు వాసన చూసి వెనుకకు (కుడివైపు) చల్లుకొని ఈ మంత్రం చదవాలి.
ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఓం ఆపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
..చేతిలో అక్షతలు తీసుకొని సంకల్పం చెప్పాలి
సంకల్పం
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభేశోభనే ముహూర్తే శ్రీమహా విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూద్వీపే, భరతఖండే, భరత వర్షే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, కృష్ణా గోదావర్యోః మధ్యదేశే, స్వగృహే (సొంతిల్లు కానివారు లక్ష్మీ నివాస గృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ శుభకృత్ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షరుతౌ, భాద్రపదమాసే, శుక్ల పక్షే చతుర్థ్యాం తిథౌ, సౌమ్య వాసరే శుభవాసరే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః ……. గోత్రః (ఎవరికి వారు గోత్రం చెప్పుకోవాలి)…… నామధేయః(కుటుంబ పెద్దపేరు మాత్రం చెబితే చాలు) ……. గోత్రోద్భవస్య…… (గోత్రం) నామధేయస్య (వినాయక వ్రతంలో పాల్గొంటున్నవారితోపాటు కుటుంబసభ్యులు అందరి పేర్లనూ చెప్పుకోవచ్చు) ధర్మపత్నీ సమేతస్య (వివాహం అయినవారు మాత్రమే చదవాలి) మమ సహకుటుంబస్య, సబాంధవస్య క్షేమ ైస్థెర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, సమస్త దురితో పశాంత్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థం, వర్షేవర్షే ప్రయుక్త శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవతా ముద్దిశ్య, వర్షేవర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే..
అంటూ అక్షతలు, నీళ్ళు పళ్లెంలో వదలాలి.
కలశారాధన
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే
ఒక చెంబును తీసుకుని దానికి పసుపు రాసి, పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత ఆ పాత్రలో తమలపాకు, అక్షతలు వేసి ఆ కలశాన్ని కుడిచేతితో మూసి ఉంచి ఈ శ్లోకాన్ని చెప్పాలి.
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః
మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః
కుక్షౌతు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరాః
రుగ్వేదోద యజుర్వేదః సామవేదో అధర్వణః
అంగైశ్చసహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
కలశంలోని నీటిని తమలపాకుతో తిప్పుతూ ఈ కింది శ్లోకాన్ని పఠించాలి
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
కలశంలోని నీటిని తమలపాకుతో వినాయకుడి మీద, పూజా ద్రవ్యాల పైన, పూజలో కూర్చున్నవారిపై, కుటుంబ సభ్యులపై చిలకరించాలి.
కొన్ని అక్షతలు పసుపు గణపతిపై చల్లి నమస్కరించాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తోస్తు తథాస్తు.
(ఈ కింది విధంగా జపిస్తూ గణనాయకుడికి నమస్కరించాలి)
శ్లో॥ సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః,
ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః
షోడశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే॥
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ధ్యాయామి ధ్యానం సమర్పయామి.. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.
(..అని అనుకొని కొన్ని అక్షతలు పసుపు గణపతిపై వెయ్యాలి.)
ఆసనం సమర్పయామి (పువ్వులను పసుపు గణపతి వద్ద ఉంచి, కింది మంత్రం చదువుతూ నీళ్లు సంప్రోక్షించాలి)
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయో పాద్యం సమర్పయామి, ఉపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి (దూదితో చేసిన వస్త్రమును లేదా పుష్పాన్ని సమర్పించాలి), గంధాన్ సమర్పయామి (గంధాన్ని చల్లాలి), గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లాలి)
పుష్పైః పూజయామి (పుష్పాలను ఉంచాలి) తరువాత గణేశునిపై ఒక్కో పుష్పాన్ని వేస్తూ ఈ కింది మంత్రంతో అర్చించాలి.
ఓం సుముఖాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం వికటాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం శూర్పకర్ణాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి.
ధూపం ఆఘ్రాపయామి (అగరుపుల్లలను వెలిగించి స్వామికి ధూపం వెయ్యాలి), దీపం దర్శయామి (దీపాన్ని చూపించాలి)
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీళ్లు చిలకరించాలి), ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరం వెలిగించాలి)
శ్లో॥ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా॥
మహాగణాధిపతియే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు, మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. (గణపతి దగ్గరున్న అక్షతలను తీసుకొని తలపై చల్లుకోవాలి).
ఇంతవరకు చేసింది పసుపు గణపతి పూజ . ఆ గణపతిని మహాగణపతి అంటారు. ఇప్పుడు మట్టి గణపతిని పూజించాలి. ఈయనే వరసిద్ధి గణపతి. చేతిలో పూలు, అక్షతలు తీసుకొని కింది శ్లోకం చదివి గణపతి పాదాల దగ్గర సమర్పించాలి.
ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రాణప్రతిష్ఠ ముహూర్తః సుముహూర్తోస్తు స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకం తాపత్తం ప్రీతిభావనే ప్రతిమేస్మిన్ సన్నిధిం కురు, సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీం పరివార సమేతం శ్రీవరసిద్ధి వినాయకస్వామిన్ స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, స్థిరోభవ, వరదోభవ ప్రసీదః ప్రసీదః ప్రసీదః
శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
(కింది శ్లోకం చదువుతూ స్వామిపై అక్షతలు వేస్తూ నమస్కరించాలి)
ఆవాహనం శ్లో॥ అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర
అనాథనాథ సర్వజ్ఞ, గౌరీగర్భ సముద్భవ ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
ఆవాహయామి ఆవాహనం సమర్పయామి
(కింది శ్లోకం చదువుతూ స్వామిపై అక్షతలు వేస్తూ నమస్కరించాలి)
ఆసనం శ్లో॥ మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం
రత్న సింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః నవరత్న ఖచిత స్వర్ణసింహాసనార్థం-హరిద్రాక్షతాన్ సమర్పయామి.
(కింది శ్లోకం చదువుతూ పుష్పముతో గణేశుని చేతులపై నీళ్లు చల్లాలి)
అర్ఘ్యం శ్లో॥ గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన
గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
హస్తయోః అర్ఘ్యం సమర్పయామి
(కింది శ్లోకం చదువుతూ పుష్పముతో గణేషుని పాదాలపై నీళ్లు చల్లాలి)
పాద్యం శ్లో॥ గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక
భక్త్యాపాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన ॥
ఓం శ్రీ వరసిద్ధ్ది వినాయకాయ నమః
పాదయోః పాద్యం సమర్పయామి
ఆచమనీయం శ్లో॥ అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
ముఖేః శుద్ధ ఆచమనీయం సమర్పయామి
(కింది శ్లోకం చదువుతూ ఆవు పాలు, పెరుగు, నెయ్యిలతో కూడిన మిశ్రమాన్ని సమర్పించాలి)
మధుపర్కం శ్లో॥ దధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
మధుపర్కం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పుష్పంతో స్వామిపై పంచామృతాలు చిలకరించాలి)
పంచామృతం శ్లో॥ స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజితః॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
పంచామృత స్నానం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పుష్పంతో నీటిని రెండుసార్లు స్వామిపై చల్లాలి)
శుద్ధోదక స్నానం శ్లో॥ గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైః అమలైర్జలైః
స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
శుద్ధోదక స్నానం సమర్పయామి.
స్నానానంతరం పునః శుద్ధాచమనీయం సమర్పయామి.
(కింది శ్లోకం చదువుతూ పత్తితో చేసిన వస్ర్తాన్నిగానీ, రెండు పుష్పాలను గానీ వినాయకుడికి సమర్పించాలి)
వస్త్రం శ్లో॥ రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం
శుభప్రదం గృహాణత్వం, లంబోదర హరాత్మజ॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
వస్త్రయుగ్మం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామికి వెయ్యాలి)
యజ్ఞోపవీతం శ్లో॥ రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనంచోత్తరీయకం – గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్ట దాయక॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
యజ్ఞోపవీతం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పుష్పంతో గంధాన్ని స్వామిపై వెయ్యాలి)
గంధం శ్లో॥ చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
దివ్య శ్రీ చందనం సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ అక్షతలు స్వామిపై వెయ్యాలి)
అక్షతలు శ్లో॥ అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్
తండులాన్ శుభాన్
గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
అలంకరణార్థం హరిద్రాక్షతాన్ సమర్పయామి
(కింది శ్లోకాన్ని చదువుతూ పుష్పాలు స్వామిపై వెయ్యాలి)
పుష్పములు– శ్లో॥ సుగంధాని చ సుపుష్పాణీ జాజీకుంద
ముఖానిచ – ఏకవింశతి పత్రాణి
సంగృహాణ నమోస్తుతే॥
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః
పుష్పాణి పూజయామి
(కింది నామాలు చదువుతూ పత్ర, పుష్పాదులతో స్వామివారిని అర్చించాలి).
ఓం గణేశాయ నమః – పాదౌ పూజయామి
ఓం ఏకదంతాయ నమః – గుల్ఫౌ పూజయామి
ఓం విఘ్నరాజాయ నమః – జానునీ పూజయామి
ఓం కామారి సూనవే నమః – జంఘే పూజయామి
ఓం ఆఖువాహనాయ నమః – ఊరూ పూజయామి
ఓం హేరంబాయ నమః – కటిం పూజయామి
ఓం లంబోదరాయ నమః – ఉదరం పూజయామి
ఓం గణనాథాయ నమః – నాభిం పూజయామి
ఓం గణేశాయ నమః – హృదయం పూజయామి
ఓం స్థూలకంఠాయ నమః – కంఠం పూజయామి
ఓం స్కందాగ్రజాయ నమః – స్కందౌ పూజయామి
ఓం పాశహస్తాయ నమః – హస్తౌ పూజయామి
ఓం గజవక్త్రాయ నమః – వక్త్రం పూజయామి
ఓం విఘ్నహంత్రే నమః – నేత్రౌ పూజయామి
ఓం శూర్పకర్ణాయ నమః – కర్ణౌ పూజయామి
ఓం ఫాలచంద్రాయ నమః – లలాటం పూజయామి
ఓం సర్వేశ్వరాయ నమః – శిరః పూజయామి
ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః –
సర్వాణ్యంగాని పూజయామి
ముందుగా సిద్ధం చేసుకున్న 21 రకాలు లేదా దొరికిన పత్రితో కింద పేర్కొన్న నామాలు చదువుతూ గణనాథుణ్ని పూజించాలి.
ఓం సుముఖాయ నమః – మాచీపత్రం పూజయామి ॥
ఓం గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి॥
ఓం ఉమా పుత్రాయ నమః- బిల్వపత్రం పూజయామి॥
ఓం గజాననాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి॥
ఓం హరసూనవే నమః – దత్తూరపత్రం పూజయామి॥
ఓం లంబోదరాయ నమః- బదరీపత్రం పూజయామి॥
ఓం గుహాగ్రజాయ నమః – అపామార్గపత్రం పూజయామి॥
ఓం ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి॥
ఓం గజకర్ణికాయ నమః – తులసీపత్రం పూజయామి॥
ఓం వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి॥
ఓం భిన్న దంతాయ నమః- విష్ణుక్రాంతపత్రం పూజయామి॥
ఓం వటవే నమః – దాడిమీపత్రం పూజయామి॥
ఓం సర్వేశ్వరాయ నమః – దేవదారుపత్రం పూజయామి॥
ఓం ఫాలచంద్రాయ నమః- మరువకపత్రం పూజయామి॥
ఓం హేరంబాయ నమః – సింధువారపత్రం పూజయామి॥
ఓం శూర్పకర్ణాయ నమః – జాజీపత్రం పూజయామి॥
ఓం సురాగ్రజాయ నమః- గండకీపత్రం పూజయామి॥
ఓం ఇభవక్త్రాయ నమః – శమీపత్రం పూజయామి॥
ఓం వినాయకాయ నమః- అశ్వత్థపత్రం పూజయామి॥
ఓం సుర సేవితాయ నమః- అర్జునపత్రం పూజయామి॥
ఓం కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి॥
ఓం శ్రీ గణేశ్వరాయ నమః- ఏకవింశతి పత్రం పూజయామి॥
(మిగిలిన మొత్తం పత్రాలనూ స్వామికి సమర్పించాలి).
ధూపం
దశాంగం గుగ్గులోపేతం
సుగంధం సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణవరదోభవ॥
ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః
ధూపమాఘ్రాపయామి
దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం
వహ్నినాద్యోతితం మయా
గృహాణ మంగళం దీపం
ఈశపుత్ర నమోస్తుతే॥
ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః
దీపం దర్శయామి
నైవేద్యం
ఉండ్రాళ్లు, కొబ్బరికాయ వంటి మహానైవేద్యం చూపించాలి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
నైవేద్యంపై పుష్పంతో వీళ్లు చల్లాలి.
ఓం సత్యంత్వర్తేన పరిషంచయామి (నైవేద్యం చుట్టూ నీళ్లు చల్లాలి) ఓం అమృతమస్తు (స్వామివారి దగ్గర నీళ్లు చల్లాలి) ఓం అమృతోపస్తరణమసి అని నైవేద్యం చుట్టూ మళ్లీ నీళ్లు చల్లి ఎడమ చేతితో కుడిచేతిని పట్టుకుని కింది శ్లోకాన్ని, మంత్రాలను చదువుతూ కుడిచేతితో అయిదుసార్లు నైవేద్యాన్ని స్వామివారికి చూపించాలి.
ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా.. మధ్యేమధ్యే పానీయం సమర్పయామి (నీళ్లు సమర్పించాలి)
అమృతాపిథానమసి. ఉత్తరాపోశనం సమర్పయామి (నీళ్లు చిలకరించాలి) హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ నీళ్లు చల్లాలి.
తాంబూలం
తాంబూలాన్ని స్వామివారికి సమర్పించాలి.
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః తాంబూలం సమర్పయామి
పుష్పం
ఓం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః సువర్ణ పుష్పం సమర్పయామి
నీరాజనం
సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః
యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రయాముకే
తయామాసగ్ం సృజామసి సంతత
శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు
శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః నీరాజనం సమర్పయామి
పుష్పంతో హారతి పళ్లెంపై నీళ్లు చల్లి హారతిని అందరూ కండ్లకు అద్దుకోవాలి. నీరాజనం అనంతరం… శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారిపై పువ్వుతో నీళ్లు చిలకరించాలి.
వినాయక చతుర్థినాడు చంద్రుని చూడరాదు. పొరపాటున చూస్తే విష్ణుపురాణంలోని ఈ కింది శ్లోకాన్ని చదువుకుంటే ఆ దోషం తొలగిపోతుందని నిర్ణయసింధులో పేర్కొని ఉంది.
సింహః ప్రసేన మవధీత్ సింహోజాంబవతా హతః
సుకుమారక మారోదీః తవ హ్యేషస్స్య మంతకః
వినాయకునికి గరికపూజ ప్రీతి, కిందినామాలను చదువుతూ ఒక్కో నామానికి రెండు గరికలను స్వామివారికి సమర్పించండి.
ఓం గణాధిపాయ నమః- దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఉమాపుత్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఆఖువాహనాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం వినాయకాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఈశపుత్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఏకదంతాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం ఇభవక్త్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం మూషికవాహనాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం కుమారగురవే నమః – దూర్వాయుగ్మం పూజయామి
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః – దూర్వాయుగ్మం పూజయామి
మంత్రపుష్పం
అక్షతలు చేతిలో ఉంచుకుని కింది శ్లోకాన్ని చదవండి.
తత్పురుషాయ విద్మహే, వక్రతుండాయ ధీమహి
తన్నోదంతిః ప్రచోదయాత్
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః
మంత్రపుష్పాంజలిం సమర్పయామి.
చేతిలోని పూలు, అక్షతలు స్వామివారిపై ఉంచాలి.
ప్రదక్షిణం
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష గణాధిప
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః ఆత్మ
ప్రదక్షిణం, సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి.
పునః అర్ఘ్యం
పుష్పంతో నీళ్లు సమర్పించాలి.
అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్ర ప్రదాయక
గంధపుష్పాక్షతైర్యుక్తం ప్రాతస్థం పాపనాశన
పువ్వులు, అక్షతలు తీసుకోవాలి. కింది శ్లోకాన్ని
చదివి గణనాథుడి పాదాల వద్ద ఉంచి నమస్కరించాలి.
నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశక
ఈప్సితంమే వరందేహి పరిత్ర చ పరాంగితమ్
వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా
అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశా
పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక
ఓం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి
సర్వోపచారాలు
అక్షింతలు స్వామివారి పాదాల వద్ద వేయండి. ఓం శ్రీవరసిద్ధి వినాయకస్వామినే నమః ఛత్రం ఆచ్చాదయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, శకటానారోహయామి, ఆందోళికానారోహయామి, సమస్త రాజోపచార, శక్త్యుపచార, భక్త్యుపచార పూజాం సమర్పయామి.
క్షమా ప్రార్థన
చేతిలో అక్షతలు తీసుకొని, కొన్ని నీళ్లు పోసుకొని కింది శ్లోకాన్ని చదివాక ఒక పళ్లెంలో వదలాలి.
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపా
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజాయచ అష్టోత్తర శతనామార్చనాయచ, అవసర, మహానివేదన యాచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు
చివరగా స్వామివారి ముందున్న పూజాక్షతలను పెద్దలు తమ శిరస్సుపై వేసుకొని, కుటుంబసభ్యులందరిపై వేయాలి. తర్వాత చేతిలో అక్షతలు ఉంచుకొని వ్రతకథ చెప్పుకోవాలి..
ఒకరోజు ధర్మరాజును శౌనకాది మహామునులందరూ కలిసి, సూతుడి దగ్గరికి వెళ్లి సత్సంగ కాలక్షేపం చేయాలని భావించారు. అప్పుడు సూతుడు మిగతా మునులతో ‘నేను ఈ రోజు మీకు వినాయకుని పుట్టుక, చవితి రోజున చంద్రుణ్ని దర్శిస్తే కలిగే దోషం, దాని నివారణోపాయములు వివరిస్తాను’ అని చెప్పడం మొదలు పెట్టాడు. శౌనకాది మహా మునులంతా శ్రద్ధగా వింటున్నారు.
పూర్వకాలంలో ఏనుగు రూపం కల గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ‘గజాసురా! నీకేమి వరము కావలెనో కోరుకో’ అని అడిగాడు. అప్పుడు గజాసురుడు శివుణ్ని అనేక విధాలుగా స్తుతించి ‘స్వామీ! లోకాలన్నిటిలోనూ పూజలందుకునే మీరు ఇకపై నా ఉదరంలో నివాసం ఉండాలి’ అని వరాన్ని అడిగాడు. భక్తుల కోరికలను ఎన్నడూ జవదాటని బోళా శంకరుడు వెంటనే గజాసురుని ఉదరంలో ప్రవేశించి అక్కడే నివాసం ఉన్నాడు.
కైలాసంలో పార్వతీదేవి తన భర్త ఎటు వెళ్లాడో తెలియక అనేకచోట్ల వెతికి, ఎక్కడా కనిపించక నిరాశ చెందింది. కొంత కాలానికి తన పతి గజాసురుడనే రాక్షసుని ఉదరంలో ఉన్నాడని తెలుసుకుంది. శంకరుడిని తిరిగి తీసుకువచ్చే మార్గం తెలియక బాధపడుతూ చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి, జరిగినదంతా చెప్పి ‘ఓ మహానుభావా! పూర్వం భస్మాసురుడి బారి నుంచి నా భర్తను రక్షించావు. ఇప్పుడు కూడా అలాగే తగు ఉపాయముతో రక్షించమని’ అడిగింది. అప్పుడు శ్రీహరి పార్వతిని అనునయించి నేనున్నానని అభయమిచ్చాడు. బ్రహ్మాది దేవతలను పిలిపించాడు విష్ణువు. గజాసురుని ఉదరంలో బందీ అయిన పరమేశ్వరుడిని ఎలా బయటికి తీసుకురావాలో చర్చించాడు. చివరికి ‘దీనికి గంగిరెద్దుల మేళమే సరి అయినదనే’ ఆలోచనకు వచ్చాడు. శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించారు దేవతలు. బ్రహ్మాది దేవతలంతా తలో వాద్యం చేతబూనారు. విష్ణువు చిరుగంటలు, సన్నాయి పట్టుకొని మేళగాని వేషం కట్టుకున్నాడు.
దేవతలంతా గంగిరెద్దు మేళంతో గజాసురుని రాజ్యంలో ప్రవేశించారు. నగరంలో పలు చోట్ల జగన్మోహనముగా గంగిరెద్దును ఆడించారు. ఆ నోటా ఈ నోటా వీరి ఆటాపాటా సంగతి గజాసురునికి చేరింది. వారిని పిలిపించి తమ భవనం ఎదుట మేళం కట్టమన్నాడు గజాసురుడు. బ్రహ్మాది దేవతలు వాద్యాలను విశేషంగా వాయిస్తూ వీనుల విందు చేశారు. శ్రీహరి గంగిరెద్దును చిత్రవిచిత్రంగా ఆడిస్తూ గజాసురునికి కన్నులపండువ చేశాడు. వారి ప్రదర్శనకు పరమానంద భరితుడయ్యాడు గజాసురుడు. ‘మీకేమి కావాలో కోరుకోండి’ అని అడిగాడు. అప్పుడు శ్రీహరి గజాసురుడిని సమీపించి ‘ఓ రాజా! ఇది శివుని వాహనమైన నంది. శివుడిని కనుగొనడానికి వచ్చింది. కనుక, పరమశివుడిని తిరిగి ఇవ్వమ’ని అన్నాడు. ఆ మాటలకు ఉలిక్కిపడ్డాడు గజాసురుడు. ఆ వచ్చింది రాక్షసాంతకుడైన శ్రీహరి అని గుర్తించి తనకిక మరణం తప్పదనుకున్నాడు. ‘నా శిరస్సుకు త్రిలోకాలలో పూజలు జరగాలి. నా చర్మాన్ని నీవు ధరించాలి’ అని తన ఉదరంలో ఉన్న శివుడిని ప్రార్థించాడు గజాసురుడు. శంకరుడు ‘సరేనని’ వరమిచ్చాడు. వెంటనే శ్రీహరి అనుమతితో నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చి సంహరించాడు. శివుడు ఆ అసురుని ఉదరం నుంచి బయటికి వచ్చి విష్ణుమూర్తిని స్తుతించాడు. బ్రహ్మాదులతో శ్రీహరి ‘దుష్టులకు ఇటువంటి వరములు ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే పాముకు పాలు పోసి పెంచినట్లు అవుతుంది’ అని చెప్పి వైకుంఠానికి వెళ్లిపోయాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికేగాడు. బ్రహ్మాది దేవతలు స్వస్థలాలకు వెళ్లిపోయారు.
కైలాసంలో ఉన్న పార్వతి తన భర్త వస్తున్నాడని దేవతల ద్వారా తెలుసుకొని సంతోషించింది. అభ్యంగన స్నానం చేసి, నలుగు పిండితో ఒక బాలుణ్ని తయారుచేసి ప్రాణం పోసింది. ఆ బాలుణ్ని ద్వారం దగ్గర కాపలాగా ఉంచింది. సర్వాభరణాలు అలంకరించుకున్న పార్వతి పశుపతి రాక కోసం ఎదురుచూస్తూ తన గదిలో ఉంది. అంతలో పరమేశ్వరుడు నందిని అధిరోహించి కైలాసానికి వచ్చాడు. గదిలోకి వెళ్లబోతుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడు పరమశివుణ్ని అడ్డగించాడు. దానితో కోపావేశుడైన శివుడు, తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సు ఛేదించి లోపలికి వెళ్లాడు.
చాలాకాలం తర్వాత వచ్చిన శివుడిని సాదరంగా ఆహ్వానించింది పార్వతి. దంపతులిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో బాలుని ప్రస్తావన వచ్చింది. జరిగిన పొరపాటును తలచుకొని శంకరుడు చింతించాడు. అదే సమయంలో మహేశ్వరునికి తాను గజాసురునికి ఇచ్చిన వరం గుర్తొచ్చింది. శివగణాలను పంపి గజాసురుని తలను తెప్పించాడు. దానిని ఆ బాలుడి శరీరానికి అతికించి ప్రాణం పోసి ‘గజాననుడనే’ పేరు పెట్టాడు. ఆ బాలుడిని పుత్ర వాత్సల్యంతో ఆదిదంపతులు ఇద్దరూ అల్లారుముద్దుగా పెంచసాగారు. గజాననుడు కూడా భక్తి ప్రపత్తులతో తల్లిదండ్రులను సేవించాడు. అనింద్యుడనే ఎలుకను వాహనంగా చేసుకున్నాడు గజాననుడు. కొన్ని రోజులకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను మహా బలశాలి. కుమారస్వామి నెమలిని వాహనంగా చేసుకుని దేవతల సేనానాయకుడిగా ప్రఖ్యాతి చెందాడు.
ఒకరోజు దేవతలు, మునులు పరమశివుణ్ని సేవించి, విఘ్నములకు అధిపతిగా ఒకరిని నియమించమని అడిగారు. అక్కడే ఉన్న కుమారస్వామి ‘గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు. కావున, ఆ ఆధిపత్యము తనకు ఇవ్వమ’ని తండ్రిని ప్రార్థించాడు. అప్పుడు శివుడు గజాననుడిని, కుమారస్వామిని పిలిచి ‘మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదులన్నిటిలో స్నానం చేసి నా దగ్గరికి వస్తారో వారికి ఈ ఆధిపత్యం ఇస్తాన’ని చెప్పాడు. పరీక్షకు కుమారస్వామి సమ్మతించి తన వాహనమైన నెమలి మీద ఎక్కి వాయువేగంతో వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న గజాననుడు తండ్రి దగ్గరికి వెళ్లి వినమ్రంగా నమస్కరించి ‘తండ్రీ! నా అసమర్థత తెలిసి కూడా మీరు ఇలాంటి పరీక్ష పెట్టడం తగునా’ అంటూ, తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు శివుడు కరుణతో ‘వత్సా! ఒక్కసారి నారాయణ మంత్రాన్ని పఠించినవారు మూడువందల కల్పాల కాలం పుణ్యనదులలో స్నానం ఆచరించిన ఫలం పొందుతార’ని చెప్పి గజాననుడికి మంత్రం ఉపదేశించాడు. గజాననుడు కైలాసంలోనే ఉండి తండ్రి ఉపదేశించిన మంత్రాన్ని ధ్యానించాడు. నారాయణ మంత్ర ప్రభావంతో కుమారస్వామి ఏ నదిలో స్నానం ఆచరించడానికి వెళ్లినా తనకంటే ముందుగా గజాననుడు అక్కడ ఉండటాన్ని గమనించాడు. అన్ని నదుల్లో స్నానం చేసి కైలాసానికి వెళ్లిన కుమారస్వామికి అక్కడ శివుని పక్కనే గజాననుడు కనిపించాడు. అన్న గొప్పదనాన్ని గుర్తించిన కుమారస్వామి ఆయనకు నమస్కరించి ‘ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వమ’ని తండ్రిని కోరాడు. ఈ విధంగా ‘భాద్రపద శుద్ధ చవితి’ నాడు గజాననుడు విఘ్నాధిపత్యం పొందాడు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేవతలు, భక్తులు విఘ్నేశ్వరుడికి కుడుములు, ఉండ్రాళ్లు మొదలైనవి నైవేద్యంగా పెట్టగా.. వాటిని సంతోషంగా తిని, కొన్ని తన వాహనానికి పెట్టి, మిగతా వాటిని చేతిలో పెట్టుకుని భుక్తాయాసంతో సాయంకాలానికి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. ఎక్కువగా ఆరగించడం వల్ల వంగడానికి శరీరం సహకరించక ఇబ్బందిపడుతున్న విఘ్నేశ్వరుడిని చూసి శివుని శిరసులోని చంద్రుడు వికటంగా నవ్వాడు. ‘రాజదృష్టి సోకితే రాయి అయినా పగులును’ అన్న సామెత నిజమైనట్టు గజాననుడి పొట్టపగిలి అంతకుముందు అతను తిన్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం దొర్లి గణేశుడు మృతిచెందాడు. తన పుత్రుని మరణం చూసి తట్టుకోలేని పార్వతి ‘పాపాత్ముడా! నీ దృష్టి వల్ల నా కుమారుడు మరణించాడు. ఇకపై నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’ అని శపించింది.
అదే రోజున సప్తమహర్షులు యజ్ఞం చేస్తున్నారు. వారి భార్యలు అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. రుషిపత్నులను చూసి మోహించిన అగ్నిదేవుడు శాపభయంతో క్షీణించసాగాడు. ఇది గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతి రూపం తప్ప, తక్కిన ఆరుగురు రుషిపత్నుల రూపాలను ధరించి పతికి సేవ చేయసాగింది. ఇది చూసిన రుషులు తమ భార్యలే అగ్నికి ఉపచారాలు చేస్తున్నారని అనుమానించి వారిని విడిచిపెట్టారు. విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు ‘ఓ రుషి పుంగవులారా! ఆ రోజు అగ్నిదేవుడిని సేవించిన వాళ్లు మీ భార్యలు కారు’ అని జరిగిందంతా చెప్పి వారిని సమాధానపరిచాడు. మీ పత్నులు చంద్రుడిని చూడటం వల్ల ఇలాంటి అపనిందకు గురయ్యారని తెలిపాడు. దీనికి పరిహారం కోరుతూ బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను వేడుకొన్నారు. మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ని బతికించారు. చంద్రునికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పార్వతిని కోరారు. ‘భాద్రపద శుద్ధ చవితి మినహా మిగతా రోజుల్లో చంద్రుణ్ని చూస్తే ఏ సమస్యా ఉండద’ని పార్వతీదేవి శాపాన్ని సడలించింది. దేవతలంతా సంతోషించి తమ ఇండ్లకు చేరుకుని వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండసాగారు.
ద్వాపర యుగంలో ఒకనాడు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని చూడటానికి దేవర్షి నారదుడు వస్తాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. సాయంత్రం కావడంతో ‘ఈ రోజు వినాయక చతుర్థి. చంద్రుణ్ని చూడరాదు. కనుక, తను బయల్దేరుతాన’ని జరిగిన వృత్తాంతం అంతా కృష్ణుడికి తెలిపి స్వర్గానికి వెళ్లిపోతాడు. విషయం తెలుసుకున్న కృష్ణుడు ‘ఈ రోజు చంద్రుణ్ని చూడరాద’ని రాజ్యంలో చాటింపు వేయిస్తాడు. కాసేపయ్యాక కృష్ణుడు గోశాలకు వెళ్లి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి, ‘ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో కదా’ అని చింతించాడు.
కొన్నాళ్లకు యదువంశ రాజు సత్రాజిత్తు సూర్యుడిని ఉపాసించి శమంతకం అనే పేరు గల అద్భుత మణిని సంపాదిస్తాడు. ద్వారకా నగరంలోని శ్రీకృష్ణుణ్ని సందర్శిస్తాడు. అతణ్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి మర్యాద చేసి, ‘ఈ మణిని మన రాజుకు ఇమ్మని’ అడుగుతాడు. ‘రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చే ఈ మణిని తాను ఎవ్వరికీ ఇవ్వనని’ తిరస్కరిస్తాడు సత్రాజిత్తు. ‘సరే నీ ఇష్టం’ అని ఊరుకుంటాడు కృష్ణుడు. ఇలాకొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. అక్కడ ఒక సింహం ప్రసేనుడిపై దాడి చేసి మణిని నోట కరుచుకొని వెళ్లిపోతుంది. మణితో పోతున్న సింహాన్ని ఎలుగుబంటి (జాంబవంతుడు) సంహరించి ఆ మణిని తీసుకొని గుహకు వెళ్లి కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తుంది.
మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విని కోపంతో ‘ఆ రోజు శ్రీకృష్ణుడికి మణి ఇవ్వలేదని, నా తమ్ముడిని చంపి మణిని తస్కరించాడని’ నగరమంతా చాటింపు వేయిస్తాడు. అది విన్న శ్రీకృష్ణుడు బాధపడి ‘అయ్యో ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందుకే కదా ఇటువంటి నీలాపనిందలు’ అని అనుకున్నాడు. ఆ అపవాదు తొలగించుకునేందుకు బంధుసమేతుడై అడవికి వెళ్లి అంతటా వెతుకుతాడు. ఒకచోట ప్రసేనుని మృతదేహం, ఆ పక్కగా సింహం కాలి జాడలు, కొంత దూరం వెళ్లాక ఎలుగుబంటి పాదముద్రలు కనిపిస్తాయి. వాటివెంట కొంతదూరం వెళ్లగా ఓ గుహ కనిపిస్తుంది. తన పరివారాన్ని బయటే ఉంచి శ్రీకృష్ణుడు లోపలికి వెళ్తాడు. అక్కడ మణితో ఆడుకుంటున్న జాంబవతిని చూస్తాడు. కృష్ణుడిని చూసిన జాంబవతి కేకలు వేయడంతో జాంబవంతుడు అక్కడికి వస్తాడు. కృష్ణుడితో భీకర యుద్ధం చేస్తాడు. ఇద్దరి మధ్యా 28 రోజులు యుద్ధం కొనసాగుతుంది. క్రమంగా జాంబవంతుడు అలసటకు గురవుతాడు. ‘నా బలాన్ని హరించే శక్తి ఉన్న మహాపురుషుడు శ్రీరాముడు ఒక్కడే!’ అని గుర్తించిన జాంబవంతుడు ‘దేవదేవా! భక్తజన పాలకా! నీవు శ్రీరామచంద్రుడివని నేను గుర్తించాను. త్రేతాయుగంలో నీవు నా మీద ప్రేమతో వరం కోరుకొమ్మని అడుగగా, నేను బుద్ధిమాంద్యంతో మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. ఇంతకాలానికి నా కోరిక తీరింది’ అని కృష్ణుడిని కీర్తించాడు జాంబవంతుడు.
కృష్ణుడు జాంబవంతుడికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి మణిని ఇమ్మని కోరాడు. ‘స్వామీ! ఈ మణితో పాటు నా పుత్రికను కూడా స్వీకరించి నన్ను ధన్యుణ్ని చేయమని’ అభ్యర్థించాడు. దానికి శ్రీకృష్ణుడు అంగీకరించి మణితోపాటు జాంబవతిని కూడా తీసుకుని ద్వారకకు బయల్దేరుతాడు. తర్వాత సత్రాజిత్తుకు జరిగిన వృత్తాంతం అంతా తెలిపి శమంతకమణిని అతడికి ఇచ్చేస్తాడు. కృష్ణుడిని అనుమానించినందుకు క్షమాపణ కోరిన సత్రాజిత్తు పరిహారంగా తన కూతురైన సత్యభామను భార్యగా స్వీకరించమని కోరుతాడు. శుభముహూర్తాన జాంబవతి, సత్యభామలతో శ్రీకృష్ణుడి వివాహం జరుగుతుంది.
ఈ వివాహానికి తరలి వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుణ్ని స్తుతించి ‘స్వామీ! మీరు సమర్థులు కనుక మీ మీద వచ్చిన అపనిందను పోగొట్టుకోగలిగారు. మరి, మాలాంటి సామాన్యుల గతి ఏమని’ ప్రార్థించారు. అప్పుడు శ్రీ కృష్ణుడు ‘ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకమణి కథను చదివి, విని అక్షతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుణ్ని చూసినా ఎలాంటి నిందలు కలుగవ’ని అభయమిచ్చాడు. దాంతో అందరూ సంతోషిస్తారు.
నాటినుంచి ప్రతి సంవత్సరమూ భాద్రపద శుద్ధ చతుర్థినాడు తమ శక్తికి తగ్గట్టుగా గణపతిని పూజించి, తాము సుఖంగా జీవిస్తున్నారని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించి, అక్కడే ఉన్న ధర్మరాజుతో ‘నువ్వు కూడా ఇదే ప్రకారంగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుంది. తిరిగి నీ రాజ్యం నీకు దక్కుతుంది. దీన్ని ఎంతోమంది భక్తితో ఆచరించారు. ఈ వ్రత ప్రభావంతో దమయంతి నలుని, శ్రీకృష్ణుడు జాంబవతిని పొందారు. ఇంద్రుడు వృత్రాసురుణ్ని సంహరించాడు. సకల విజయ ప్రదాత అయిన వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ ఈ వ్రతాన్ని యథాశక్తి చేసుకోవాలి’ అని చెప్పాడు సూతుడు. అప్పుడు ధర్మరాజు విధి ప్రకారంగా గణపతిని పూజించి సకల ఐశ్వర్యాలనూ, రాజ్యాన్ని పొంది సుఖంగా జీవించాడు.
ఇది శ్రీ స్కాంద పురాణంలో భాగమైన ఉమామహేశ్వర సంవాదంలోని వినాయక వ్రతకల్పం.
కథ ప్రారంభానికి ముందు చేతుల్లో పట్టుకున్న అక్షతలను భక్తులు తమ శిరస్సుపై ధరించాలి.
ఉద్యాపన: యజ్ఞేన యజ్ఞ మయజంత దేవాః
తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహ నాకం మహిమాన స్సచంతే
యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః
(దేవుని ఈశాన్య దిశగా కొంచెం కదపండి!)
సర్వేజనాస్సుఖినో భవంతు
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః
***
శ్రీ శంభు తనయునకు సిద్ధిగణనాథునకును
వాసిగల దేవతా వంద్యునకును
జయమంగళం నిత్య శుభమంగళం॥
ఆ సరస విద్యలకు ఆదిగురువైనట్టి
భూసురోత్తమ లోకపూజ్యునకును
జయమంగళం నిత్య శుభమంగళం॥