హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): మోకాలి చిప్ప మార్పిడి సర్జరీ అంటే లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం. పైసలున్నోళ్లే ఈ సర్జరీలు చేయించుకొనేవారు. పేదలు పంటి నొప్పి కింద ఆ బాధను భరిస్తూ కాలం వెళ్ల దీసే పరిస్థితి ఉండేది.కానీ, తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చాక నిరుపేదలకు ఉచితంగా ఈ శస్త్రచికిత్సలు చేస్తున్నది. ఆర్థోపెడిక్ విభాగంపై ప్రత్యేక దృష్టిపెట్టిన రాష్ట్ర సర్కారు.. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ తదితర సర్కారు దవాఖానల్లో మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు చేయిస్తున్నది. నాలుగు నెలల్లో గాంధీ దవాఖానలో జరిగిన 48 ఆపరేషన్లే అందుకు ఉదాహరణ. 18న ఒక్క రోజే దవాఖానలో ఆరుగురికి మోకాలి చిప్పను మార్చి వైద్యులు రికార్డు సృష్టించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల మధ్య.. సూర్యాపేటకు చెందిన పున్నమ్మ (68), హైదరాబాద్లోని అంబర్పేటకు చెందిన విజయలక్ష్మి (69), హయత్నగర్కు చెందిన మంగమ్మ (55), బీహెచ్ఈఎల్కు చెందిన నాగమణి (40), ఏపీలోని పశ్చిమగోదావరికి చెందిన నాగమునిధర (63), కర్నూలుకు చెందిన రామచారి (56)కి మోకాలి చిప్ప మార్పిడి చేశారు.
మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సకు కార్పొరేట్లో సుమారు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. గాంధీలో ఈ నెల 18న ఒకే రోజు రూ.24 లక్షల ఖరీదైన శస్త్రచికిత్సలను ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగా నిర్వహించారు.
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్కు దీటుగా మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నాం. దీని వల్ల పేద రోగులకు ఆర్థిక భారం తప్పుతున్నది. తెలంగాణ సర్కారు చొరవతో ఇప్పుడు నిరుపేద రోగులంతా గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకొంటున్నారు. గాంధీలో ప్రస్తుతం 4 ఆర్థో విభాగం ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ రాజారావు,
సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన