శ్రీశైలం : శ్రీగిరులపై దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో ఏడో రోజు బుధవారం భ్రమరాంబ అమ్మవారు కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. నల్లటి రూపంలో.. జుట్టు విరబూసుకుని భయంకరంగా ఉన్నా.. ఆ తల్లి ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించే సకలశుభంకరి అని భక్తుల నమ్మకం.
ఆదిపరాశక్తుల్లో ఏడో రూపం కాళరాత్రి. గాడిదను వాహనంగా చేసుకొని నాలుగు చేతుల్లో వర, అభయ, ముద్రలతో ఖడ్గం, లోహకంటకా (ఇనుప ముండ్లు) ఆయుధాలను ధరించి రౌద్ర రూపంలో సకల శుభప్రదాయినిగా భక్తులకు దర్శనమిచ్చింది. ఈ దేవిని స్మరించిన మాత్రానే భూత, పేతా, పిశాచాదులు భయపడి పారిపోయి, భయాలనేవి ఉండవని భక్తుల నమ్మకం.
అనంతరం అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనాన్నిఅధిష్టించిన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారికి వాహనసేవను ప్రధాన అర్చకులు వేదపండితులు శాస్ర్తోక్తంగా విశేష పూజాధి క్రతువులు నిర్వహించారు. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ జరిగింది. గరళకంఠుడు కాళరాత్రి దేవి సమేతుడై ఆలయ ప్రాకారంలో మంగళవాయిద్యాల మధ్య ఆలయోత్సవంలో భాగంగా విహరించారు.
కార్యక్రమంలో ఈవో లవన్న, అసిస్టెంట్ కమిషనర్ నటరాజ్, ఈఈ బాలమురళీ కృష్ణ, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్,మల్లయ్య, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, పర్యవేక్షకులు శ్రీహరి, అయ్యన్న, రవి పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన కళారాధన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన నృత్యాలు సంగీత విభావరి ఆద్యంతం భక్తులను అలరించింది.
పట్టువస్త్రాలు సమర్పించిన ఈవో
దసరా మహోత్సవాల సందర్భంగా పూర్వం నుంచి రాజ కుటుంబికులు చక్రవర్తుల సాంప్రదాయంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించే ఆచారాన్ని పాటిస్తూ ఈవో లవన్న కుటుంబీకులతో కలసి భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు.
మహాగౌరి అలంకారంలో..
శరన్నవరాత్రుల్లో ఎనిమిదవరోజు శనివారం భ్రమరాంబాదేవి అమ్మవారు మహాగౌరి అలంకారంలో దర్శనివ్వనున్నది. మల్లికార్జున స్వామివారికి నంది వాహన సేవ నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు.