పాలకుర్తి రూరల్/తొర్రూరు, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షావి బోగస్ మాటలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీజేపీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణలో భాగంగా బుధవారం అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన ప్రతి మాటను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని చెప్పారు.
నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్తోనే సాధ్యమని స్పష్టంచేశారు. బీజేపీ నాయకులు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ? అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వేశారా? అని నిలదీశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న బీజేపీ నాయకులు తెలంగాణలో దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. లక్షా 31వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. అనంతరం తొర్రూరులోని సమీకృత సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు దాతల సహకారంతో 100 సైకిళ్లను పంపిణీ చేశారు.