వాషింగ్టన్: టీకాలు తీసుకున్న వారికి అమెరికా ప్రభుత్వం కొత్త సూచనలు చేసింది. వ్యాక్సినేషన్ సంపూర్ణంగా ముగిసిన వారు.. ఇండోర్స్లో చాలా స్వల్ప స్థాయిలో సమావేశాలకు హాజరుకావచ్చు అని పేర్కొన్నది. అయితే టీకా తీసుకున్నవారితోనే ఆ సమావేశాలు నిర్వహించాలన్నట్లు తెలిపింది. అనవసరమైన ప్రయాణాలను ఎట్టిపరిస్థితుల్లో కొనసాగించవద్దు అని బైడెన్ ప్రభుత్వం పేర్కొన్నది. కరోనావైరస్ ఉదృతిని అడ్డుకునేందుకు అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తాజా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. పూర్తి స్థాయిలో టీకాలు తీసుకున్న వారు.. వ్యాక్సిన్ తీసుకోనివారితోనే కలవచ్చు అని పేర్కొన్నది. కానీ మాస్క్లు తప్పనిసరిగా ధరించాలి. అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని, మరోసారి వైరస్ ఉదృతిని అడ్డుకోవాలంటే, సీడీసీ మార్గదర్శకాలను పాటించాలని బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నవారు ప్రధాన జాగ్రత్తలను పాటించాలని, పర్సనల్ భేటీలకు దూరంగా ఉండాలని, వ్యాక్సిన్ తీసుకోని వారిని కలిసినప్పుడు మాస్క్లు ధరించాలని సీడీసీ తన సూచనల్లో తెలిపింది. ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారిని మనం రక్షించుకోవాలని సీడీసీ డైరక్టర్ రొచెల్లి వాలన్స్కీ తెలిపారు. ఇప్పటికీ అమెరికాలో ప్రతిరోజు అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఆ దేశంలో కరోనాతో మరణించిన వారిలో 5,25,000 మంది ఉన్నారు. అమెరికా జనాభాలో 18 శాతం మంది ఒక డోసు టీకాను తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు కోవిడ్ రోగిని కలిస్తే.. వారు 14 రోజుల క్వారెంటైన్ పాటించాల్సిన అవసరం లేదని సీడీసీ పేర్కొన్నది.