Changes From 1 April 2022 | కొత్త ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వీటి వల్ల సామాన్యుడు మొదలు వ్యాపార వేత్తల ఆర్థిక లావాదేవీలపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. ప్రావిడెండ్ ఫండ్, ఆస్తి పన్ను, గ్యాస్ ధరలు, ఔషధాలు, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్లో మదుపుపై మీద పన్ను.. ఆయా విభాగాల్లో పెట్టుబడులకు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అవేమిటో ఓ లుక్కేద్దాం..
దేశంలో కోవిడ్-19 కేసులు దాదాపుగా తగ్గిపోయాయి. 2020 నుంచి కోవిడ్-19 నియంత్రణకు కేంద్రం విధించిన ఆంక్షలను శుక్రవారం నుంచి పూర్తిగా ఎత్తివేసింది.
శుక్రవారం నుంచి పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి. గత నెల 31 (గురువారం) లోగా అనుసంధానించాల్సి ఉంది. ఇక నుంచి ఆధార్-పాన్ అనుసంధానానికి రూ.500 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
శుక్రవారం నుంచి సొంతిల్లు కొనుగోలుచేసే వారికి ఖర్చులు పెరగనున్నాయి. ఆదాయం పన్ను చట్టంలోని 80ఈఈఏ సెక్షన్ కింద ఇచ్చిన పన్ను మినహాయింపులను కేంద్రం నిలిపివేసింది. దీంతోపాటు ముంబైలో ఇల్లు కొనుగోలు చేసేవారు ఒకశాతం మెట్రో సెస్ చెల్లించాల్సి ఉంటుంది.
ముడి సరుకుల ధరలు పెరగడంతో అన్ని ఆటోమొబైల్ సంస్థలు శుక్రవారం నుంచి తమ కార్లు, బైక్లు, వాణిజ్య వాహనాల ధరలు పెరిగాయి. శుక్రవారం నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన స్క్రాపేజీ పాలసీ కూడా అమల్లోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా 800కి పైగా ఔషధాల ధరలు పెరిగాయి. వీటిల్లో పెయిన్ కిల్లర్లు, యాంటి బయాటిక్స్, యాంటీ వైరస్ మాత్రలు ఉన్నాయి. ఎంపిక చేసిన ఔషధాల ధరలను ఫార్మా కంపెనీలు 10 శాతానికి పైగా పెంచుతున్నట్లు ప్రకటించాయి.
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులపై శుక్రవారం నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. ప్రత్యేకించి మ్యూచువల్ ఫండ్ చెల్లింపులు డిజిటల్ పద్ధతిలోనే చేయాలి. చెక్ల ద్వారా చెల్లింపులు అనుమతించరు. బ్రోకర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలు జరుపడానికి వీల్లేదు. మ్యూచువల్ ఫండ్ సంస్థలన్నీ ప్రతి మ్యూచువల్ ఫండ్కు చీఫ్ రిస్క్ ఆఫీసర్ను నియమించాల్సి ఉంటుంది.
క్రిప్టో కరెన్సీలుగా పేరొందిన వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ)లో పెట్టుబడుల్లో లాభాలు, నష్టాలతో సంబంధం లేకుండా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు బిట్ కాయిన్పై రూ.100 లాభ పడి ఉంటారనుకుందాం.. మరో టోకెన్ డోజ్ కాయిన్ ( Dogecoin ) మీద రూ.70 నష్టపోయారనుకుందాం.. కానీ మీరు లాభ పడిన రూ.100 మీద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బిట్ కాయిన్లో లాభ పడిన రూ.100లో డిజ్కాయిన్లో నష్టం రూ.70 తీసివేస్తే నికర లాభం రూ.30 వచ్చినా.. నష్టంతో సంబంధం లేకుండా మొత్తం రూ.100 పైన పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నమాట.
కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టం (ఎన్పీఎస్) మీద 14 శాతం వరకు టాక్స్ బెనిఫిట్ క్లయిమ్ చేయొచ్చు. ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీడీ (2) కింద ఈ బెనిఫిట్ పొందొచ్చు.