బెంగళూరు : పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దక్షిణ మధ్య, దక్షిణ కన్నడ జిల్లాల్లో ప్రభుత్వం బుధవారం రాత్రి నుంచి నైట్కర్ఫ్యూ విధించింది. అలాగే శుక్రవారం రాత్రి 9 నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 13 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయంటూ దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్ కేవీ రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కేరళతో సరిహద్దులో ఉన్న జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కర్ఫ్యూ సమయంలో అవసరమైన సేవలను అనుమతి ఉంటుందని, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. అలాగే ఈనెల 13వ తేదీ వరకూ బెంగళూరు నగర వ్యాప్తంగా నైట్కర్ఫ్యూ అమలులో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ కమల్పంత్ వెల్లడించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలలో నలుగురికి మించి ఉండరాదన్నారు. రాత్రి 9 గంటలకు ముందుగానే అన్ని వ్యాపారాలు నిలిపివేయాలన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లకు కూడా ఈ నిబంధన వర్తింస్తుందన్నారు.
బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్పోర్టులకు మినహాయింపు ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నిషేధాజ్ఞలను పొడిగించిన ఉత్తర్వులను అన్ని పోలీసుస్టేషన్లకు పంపారు. ఇదిలా ఉండగా బుధవారం కర్ణాకటలో 1,159 కొత్త కేసులు నమోదవగా.. 21 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29,50,604కు పెరిగింది. బుధవారం నమోదైన 21 మరణాల్లో ఏడుగురు బెంగళూరు అర్బన్కు చెందిన వారు కాగా, దక్షిణ కన్నడలో ఐదుగురు, ఉడిపిలో ముగ్గురు, హాసన్లో ఇద్దరు మరణించారు.