నెపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీపై కొత్తగా అవినీతి ఆరోపణలు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా ద్రువీకరించింది. తన హోదాను వాడుకుంటూ.. సూకీ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని యాంటీ కరప్షన్ కమిషన్ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో అవినీతి వ్యతిరేక చట్టంలోని సెక్షన్ 55 కింద ఆమెపై కొత్త అభియోగాలు నమోదు అయినట్లు స్థానిక మీడియా పేర్కొన్నది. మయన్మార్లో తిరుగబాటుకు పాల్పడిన సైన్యం.. ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి ఆ దేశంలో అల్లర్లు కొనసాగుతున్నాయి. దాంట్లో ఇప్పటికే వందల సంఖ్యలో నిరసనకారులు మృతిచెందారు. రాజకీయవేత్తలు ఒకవేళ అవినీతి కేసులో దోషిగా తేలితే వారికి మయన్మార్ చట్టం ప్రకారం 15 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. సూకీతో పాటు మాజీ అధ్యక్షుడు విన్ మింట్ను తమ నివాసాల నుంచి జుంటా సైన్యం గుర్తు తెలియని ప్రాంతానికి తరలించింది.