పారిస్: ఫ్రాన్స్లో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తున్నది. రాజధాని పారిస్ సహా పలు నగరాల్లో కరోనా విజృంభిస్తున్నది. దేశ కార్మిక శాఖ మంత్రి ఎలిజబెత్ బోర్న్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఇకనుంచి ఆఫీసుకు రాకుండా రిమోట్గా పని చేస్తానని ఆమె వెల్లడించారు. కొన్ని లక్షణాలు ఉన్నాయని, మిగతా అంతా బాగానే ఉందని 59 ఏళ్ల ఎలిజబెత్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఫ్రాన్స్ మంత్రివర్గంలో 8వ స్థానంలో ఉన్నారు. ఇటీవలే ఫ్రెంచి అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మాక్రాన్, ఆర్థిక మంత్రి బ్రూనో లీ మాయిరే, సాంస్కృతిక శాఖ మంత్రి ఫ్రాంక్ రీస్టెర్ కూడా కరోనా బారినపడ్డారు.
కాగా, వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. దీంతో మరోమారు దేశవ్యాప్త లాక్డౌన్ విధించాలని ఆలోచిస్తున్నది. ప్రస్తుతం స్థానికంగా అధికారులు వారాంతాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటంపై ఆంక్షలు విధిస్తున్నారు. అయితే రాజధాని పారిస్లో మరోమారు కరోనా విజృంభిస్తుండటంతో తిరిగి లాక్డౌన్ విధించాలని అధికారులు యోచిస్తున్నారు.