హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కోర్సుల్లో గుణాత్మక మార్పులకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. సీట్లునిండకుండా గుదిబండగా మారిన కాలేజీలు, కోర్సులను ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ అంశంపై ఇప్పటికే ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖలు ఆదేశాలిచ్చాయి. డిమాండ్ ఉండి, నిండుతున్న కోర్సులను, సీట్లను మాత్రమే వచ్చే ఏడాది నుంచి అనుమతించాలని నిర్ణయించారు.
ఇటీవలే ముగిసిన దోస్త్ రెండు విడతల అడ్మిషన్ల తర్వాత ఈ ప్రక్రియను చేపట్టి మూడో విడతలో ఆయా సీట్లను పెండింగ్లో పెట్టారు. రాష్ట్రంలో 4.60 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. కానీ ఏటా 2 లక్షల నుంచి 2.5 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. కొన్ని కాలేజీల్లో జీరో ప్రవేశాలుంటే, మరికొన్నింటిలో 15 శాతం లోపే ఉంటున్నాయి.
ఎకువ మంది బీకాం కంప్యూటర్స్, బీఎస్సీతో కూడిన కంప్యూటర్ కోర్సులను ఎంచుకుంటున్నారు. 15 సీట్లతో కోర్సులను కాలేజీలు నడపలేకపోతున్నాయి. దీంతో విద్యాప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. ఈ నేపథ్యంలోనే హేతుబద్ధీకరణను చేపట్టారు. గత మూడేండ్ల కాలంలో దోస్త్ ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకొని ఈ హేతుబద్ధీకరణను చేపట్టారు. దీంతో రాష్ట్రంలోని 900 కాలేజీల్లో లక్షకుపైగా సీట్లపై ప్రభావంపడే అవకాశమున్నదని అధికారులు చెప్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం ఈ కోర్సులను, సీట్లను కొనసాగించలేమని, కాలేజీలు కచ్చితంగా నడుపుతామని హామీ ఇస్తేనే కొనసాగిస్తామంటున్నారు.
రేషనలైజేషన్ ఇలా..
డిమాండ్, నిష్పత్తి ఆధారంగా కొనసాగింపు
డిగ్రీ సీట్లు 4.60 లక్షల వరకున్నాయి. ఏటా ఇంటర్లో 3.60 లక్షల విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. వీరిలో ఇంజినీరింగ్, మెడికల్కు వెళ్లేవాళ్లను మినహాయిస్తే 2 లక్షల విద్యార్థులు మాత్రమే డిగ్రీలో చేరుతున్నారు. డిమాండ్-నిష్పత్తి విధానాన్ని అనుసరించి రేషనలైజేషన్ చేస్తున్నాం. కోర్సులు, కాలేజీల హేతుబద్ధీకరణ చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించాం. దోస్త్ మూడో విడత కౌన్సెలింగ్లో అమలు పరిచాం. విద్యార్థులు ఇష్టపడే, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులను అందుబాటులో ఉంచడమే ఈ సంసరణల ముఖ్య ఉద్దేశం.
– లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
ప్రైవేట్ కాలేజీలకు నష్టం జరగకుండా చూడాలి
ఇంజినీరింగ్ ప్రవేశాల తర్వాతే విద్యార్థులు డిగ్రీలో చేరాలా.. వద్దా అని నిర్ణయం తీసుకొంటారు. ఇప్పటివరకు ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పూర్తికాలేదు. అందుకే ఈ ఏడాది దోస్త్ ప్రవేశాలు మందకొడిగా ఉన్నాయి. లక్ష సీట్లు ఫ్రీజ్ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏటా ఏదో ఒక కోర్సులో ప్రవేశాలు పెరగడం, మరికొన్నింటిలో తగ్గడం సహజం. ఒకో కోర్సులో ప్రవేశాలు ఒకో రకంగా ఉంటాయి. ఈ ఒక్క ఏడాది మినహాయించి, వచ్చే ఏడాది అమలుచేస్తే బాగుంటుందని వినతిపత్రాలు సమర్పించాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాలేజీలకు నష్టం జరగకుండా అధికారులు సంస్కరణలు చేపట్టాలి.
– ఎక్కల్దేవి పరమేశ్వర్, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి