రంగారెడ్డి, ఆగస్టు 18, (నమస్తే తెలంగాణ) : సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఫ్రీడమ్ కప్లో గెలుపొందిన విజేతలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉత్తమ పోలీసులుగా తెలంగాణ పోలీసులు నిలుస్తారన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో 24 గంటలు పనిచేస్తూ సెలవు లేకుండా, తలుపులు మూయకుండా ఉండే ఒకే ఒక కార్యాలయం పోలీస్ స్టేషన్ మాత్రమేనన్నారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహానీయుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ భావి తరాలకు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఫ్రీడమ్ కప్లో భాగంగా గెలుపొందిన విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ జీవిత చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలిసేలా విద్యార్థులకు గాంధీజీ సినిమాను ప్రదర్శిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారని, వారందరికీ మంత్రి ధన్యదాలు తెలిపారు. కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, ఎమ్మెల్సీలుమల్లేశం, దయానంద్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, రాష్ట్ర ఒలింపిక్ కార్యదర్శి జగదీశ్యాదవ్ పాల్గొన్నారు.
ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు దోహదం వికారాబాద్ కలెక్టర్ నిఖిల
పరిగి, ఆగస్టు 18 : క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదం చేస్తాయని వికారాబాద్ కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం వికారాబాద్లోని బ్లాక్ గ్రౌండ్లో ఉద్యోగులకు నిర్వహించిన క్రీడల్లో విజేతలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే మూడు రోజులపాటు క్రీడలు నిర్వహించుకుందామన్నారు. ఆటలపోటీల్లో మహిళా ఉద్యోగులు సైతం రాణించి తమ సత్తా చాటారని పేర్కొన్నారు.
గురువారం ఉదయం ఫ్రీడమ్ కప్పు క్రీడోత్సవాలను వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తి చాలా గొప్పదన్నారు. గెలుపు, ఓటమి రెండింటినీ సమాన దృష్టితో స్వీకరించాలని సూచించారు. క్రీడల్లో వాలీబాల్ పురుషుల విద్యా శాఖ జట్టు విజేతగా నిలువగా ఖోఖో, వాలీబాల్ మహిళల విభాగంలో మైనార్టీ సంక్షేమ శాఖ వారు గెలుపొందారు. వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఆర్డీవో కృష్ణన్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి హన్మంత్రావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజీ, డీపీవో మల్లారెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లే శం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఎంపీపీ చంద్రకళ, ఎంపీడీవో సత్తయ్య, ఎంఈవో బాబుసింగ్ పాల్గొన్నారు.